కంగనా రనౌత్.. బాలీవుడ్ లో ఈమెకు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది. సినిమాల్లో ఆమె పోషించే పాత్రలు కూడా అదేస్థాయిలో ఉంటాయి. ముంబై పోలీసులు, శివసేన, మీడియా.. అందరూ ఆమెకు వ్యతిరేకంగా మారారు. ఇటువంటి పరిస్థితుల్లో కంగనాకు కొండంత అండగా నిలుస్తోంది బీజేపీ. ఈ శక్తితో కంగనా తన మహారాష్ట్రలో తన వ్యతిరేకులపై దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆమె కొన్ని మీడియా చానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. గత ఎన్నికల్లో తాను గత్యంతరం లేని పరిస్థితుల్లో శివసేనకు ఓటు వేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది తప్పు అని మీడియా తేల్చడంతో ఆమె ఓవర్ యాక్షన్ బట్టబయలైంది.
కంగనా వాదన తప్పంటున్న మీడియా..
ఈమధ్యే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆమె చేస్తున్న యుద్ధం ఏకంగా ఆమె ఆఫీస్ కూల్చే వరకూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. బీజేపీకి ఓటు వేయాలనుకున్నా పొత్తుల కారణంగా తప్పని పరిస్థితుల్లో శివసేనకు ఓటు వేశానని చెప్పుకొచ్చింది. అయితే.. కంగనా చెప్పేది తప్పని మీడియా అంటోంది. కంగనా అసెంబ్లీకి బాంద్రా వెస్ట్, లోక్సభకు నార్త్- సెంట్రల్ నుంచి ఓటు వేశారు. 2009 నుంచి 2019 వరకూ మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్ సభకు కలిపి 6 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 5 సార్లు బీజేపీ, శివసేన కలసే పోటీ చేశాయి. పొత్తులతో బాంద్రా వెస్ట్, ముంబై నార్త్- సెంట్రల్ సీట్లు బీజేపీకి కేటాయించారు. అంటే ఆ ఐదు ఎన్నికల్లో శివసేన అభ్యర్థులు ఈ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం లేదు.
కంగనా ఏం చెప్తోందంటే..
దీంతో కంగనా చెప్పేది తప్పని తేలింది. కంగనా బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉన్నా శివసేనకే ఓటు వేసిందని తేలింది. గత్యంతర పరిస్థితుల్లో శివసేనకు ఓటు వేశాననే కంగనా మాట అబద్దం అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి కంగన.. తాను ఖార్ వెస్ట్లోని బీపీఎం స్కూలులో శివసేనకు ఓటు వేశానని మీడియా నివేదిక తప్పు అంటూ వివరణ ఇచ్చింది. 2012 నుంచి కంగనా ఖార్ వెస్ట్లోనే నివసిస్తోంది. ఈ ప్రాంతం బాంద్రా పశ్చిమ అసెంబ్లీ స్థానం పరిధిలోకి.. ముంబై, ఉత్తర-మధ్య లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి. 2014లో మాత్రమే శివసేన- బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి.