జగన్ స్వతహాగా క్రిష్టియన్ కానీ.., హిందూ మతాన్ని గౌరవిస్తారు.., ఆచరిస్తారు…! ప్రజా జీవితంలోకి వచ్చాక.., అందులోకి సీఎం స్థాయికి వెళ్లిన తర్వాత అన్ని మతాలు ఒక్కటే..!! అందుకే జగన్ తన తండ్రికి పిండ ప్రధానం చేశారు, రుషికేషిలో యాగం చేశారు, శారదా పీఠానికి భక్తుడిగా మారారు, పుష్కర స్నానం చేశారు, పాదయాత్ర ఆరంభం.., ముగింపు సందర్భంగా తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. జగన్ కి హిందూ, క్రిష్టియన్ భావన లేదు, ఉండకూడదు కూడా..!! కానీ ఎందుకో జగన్ పై అతి ప్రేమ, అతి భజన ఒలకబోస్తున్న బాబాయి వైవీ సుబ్బారెడ్డి అనవసర వివాదాలను కెలుకుతున్నారేమో..!!
వైవీ ఎందుకు ముందే చెప్పుకోవడం..!?
ఇక్కడ ఒక విషయం స్పష్టం..!! వైవీ అయినా.., జగన్ అయినా.., టీడీపీ అయినా గ్రహించాల్సిన అవసరం ఉంది. * ప్రభుత్వం తరపున(అంటే ప్రజల తరపున) స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు సీఎం జగన్ ని ఒక మతానికి ఎలా ముడిపెడతాం..? ఆయన దర్శనానికి వచ్చిన సాధారణ భక్తుడు కాదు కదా..!!?? * సరే స్వతహాగా భక్తి విశ్వాసాలతో జగన్ వెళ్తున్నప్పుడు పూర్వ కాలం నుండి అమలులో ఉన్న ఈ డిక్లరేషన్ ని గౌరవిస్తే తప్పేమిటి..!?? సుదీర్ఘ కాలంగా అమల్లో ఉన్న ఈ నిబంధనను జగన్ పాటించవచ్చు కదా..!?
అంటే డిక్లరేషన్ విషయంలో ఏదైనా సమర్ధించుకోవచ్చు. ఏదయినా చెప్పుకోవచ్చు. కానీ ఈ అంశాన్ని ముందుగానే కెలికి, ముందుగానే చెప్పుకుని వివాదం చేయాల్సిన అవసరమే లేదు. అనవసరంగా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడం, రాజకీయ వివాదంగా మార్చడం తప్ప వైవీ దీన్ని ప్రస్తావించాల్సిన సమయమే కాదు. కానీ ఇక్కడ జగన్ పట్ల అతి ప్రేమ, అతి భజన, అతి… ఇలా మాట్లాడించవచ్చు.
పెద్దలు ఎందరో ఫాలో అయ్యారుగా..!!?
గతంలో అనేక మంది పెద్దలు తిరుమలకు వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు. రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం.., యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు కొందరు, ఇతర రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కూడా టీటీడీ కి వస్తే డిక్లరేషన్ ఇచ్చేవారు. కొన్ని సందర్భాల్లో వివాదాలు అయినప్పటికీ సమసిపోయేవి. వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిన ఆనవాళ్లు అనేకం ఉన్నాయి. స్వామి దగ్గర హొదాలు ముఖ్యం కాదు. విశ్వాసం, భక్తి ముఖ్యం. ఇచ్చినా తప్పేమీ కాదు. చులకన కాదు. కానీ స్వామి వారి డిక్లరేషన్ అనే నిబంధన ఉన్నప్పుడు పాటించడమే శ్రేయస్కరం. అనవసర వివాదాల్లోకి లాగడం కాకపోతే ఈ వాదనలేమిటి..? ఈ రాజకీయాలేమిటి..??