మంత్రిగారి కుమారుడికి బెంజ్ కారు లంచం..! ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈఎస్ఐ కుంభకోణంలో టీడీపీ మాజీలను ఇరికించాలని చూసిన వైసీపీకి.. అదే మాజీలు చెమటలు పట్టిస్తున్నారు. జగన్ క్యాబినెట్ లోని మంత్రి కుమారుడే ఈఎస్ఐ స్కామ్ లో ఏ14 నిందితుడి నుంచి బెంజి కారు బహుమతిగా తీసుకున్నాడని ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలంటూ ఎదురు దాడి చేస్తున్నారు. ఈ పరిణామం జగన్ క్యాబినెట్ పై పెద్ద అవినీతి మరకగా మారింది. గడచిన ఆరు, ఏడు నెలల నుంచి అదే కారులో తిరుగుతున్నట్టు టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు చేస్తున్నారు. దీనిపై సరైన సమాధానం ఇచ్చుకోలేక మంత్రి జయరామ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆధారాలు చూపించి అయ్యన్న సవాల్..
ఆ కారుతో తనకు సంబంధం లేదంటున్న మంత్రి జయరామ్ వాదనలను కొట్టి పారేస్తున్నారు అయ్యన్నపాత్రుడు. మంత్రికి సంబంధం లేకపోతే ఆయన ఇంటి వద్దే ఎందుకు కారు ఉందో చెప్పాలని.. ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అతికించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్ 09 టీసీ 0262 రిజిస్ట్రేషన్ నెంబరుతో గత డిసెంబర్ 12న కారు కొనుగోలు చేశారని కూడా చెప్తున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కార్తీక్ ఈ కారు మంత్రి కుమారుడికి ఇచ్చాడని కుండబద్దలు కొడుతున్నారు అయ్యన్నపాత్రుడు. మంత్రి జయరామ్ కు కార్తీక్ బినామీ అని కూడా అంటున్నారు. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.. ఇవిగో ఆధారాలు.. రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
జగన్ ఆదేశాలే తరువాయి..?
సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుంచి అవినీతి వ్యతిరేకంగా ఉంటున్నారు జగన్. తనపై, తన ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక లేకుండా చూసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఫిర్యాదులొచ్చినా అధికారులకు స్పష్టమైన సంకేతాలిస్తూ పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో తన క్యాబినెట్ లోని మంత్రిపైనే.. లక్షల విలువైన బెంజి కారు తీసుకున్నారనే ఆరోపణలు.. ఆధారాలు కూడా వస్తూండటంతో జగన్ దీనిపై సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. విచారణ జరిపి తప్పు నిర్ధారణ జరిగితే జయరామ్ ను మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ నిరాధార అరోపణలుగా తేలితే అయ్యిన్నపాత్రుడుపై కేసు నమోదు చేసే అంశాలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.