విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగిపోయే షాకిస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
తన కుమారులతో కలిసి ఆయన వైసీపీ కండువా కప్పుకొన్నారు. దీనిపై సహజంగానే వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తుండగా తెలుగుదేశం పార్టీ భగ్గుమంటోంది. అయితే, తాజాగా ఈ ఎపిసోడ్లో మరో అంశం తెరమీదకు వచ్చింది.
చంద్రబాబు ఏమన్నారంటే…
వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసిన నేపథ్యంలో షాక్ తిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశాఖ టీడీపీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, డివిజన్ పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసిపిలో చేరడాన్ని ఖండించారు. ప్రజల నుంచి వసూళ్లు చేసిన జె ట్యాక్స్ లతో టిడిపి ఎమ్మెల్యేలను కొంటున్నారని, సంతలో పశువులను కొన్నట్లు కొనుగోళ్లు చేస్తున్నారని, వైసీపీ డబ్బులకు అమ్ముడుపోవడం దుర్మార్గంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయం. వ్యక్తిగత స్వార్ధంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ది చెబుతారుఎన్నికష్టాలు ఎదురైనా కార్యకర్తలు టిడిపి వెన్నంటే ఉంటారు.స్వార్ధంతో ఒకరిద్దరు పార్టీనుంచి పోయినా నష్టం లేదు“అంటూ వెల్లడించారు.
100 కోట్లు ఇచ్చి…
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులతో నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో ప్రసంగించిన మరుసటి రోజు ఆ పార్టీ ఓ సంచలన ప్రకటన విడుదల చేసింది. వైసీపీకి వలసల మీద ఉన్న శ్రద్ధ కరోనా, ప్రజల ఇబ్బందులపై లేదని ఆ ప్రకటన పేర్కొంది. 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ను కొన్నారు అని ఆరోపించింది. వైసీపీ ప్రభుత్వానికి పక్క పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ కరోనా నివారణలో, రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల లేదని తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. ఓ వైపు నిరుద్యోగం, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్నాయి. కానీ సీఎం జగన్ మోమన్ రెడ్డికి ఇవేమీ పట్టడంలేదు. అంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటన విరుచుకుపడింది.
జగన్ ఎమ్మెల్యేలను కొనేందుకు కారణం ఇదేనట
తమ పార్టీలోకి వచ్చే ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేసిన తర్వాతే చేర్చుకుంటామని ఎన్నికల ముందు నీతులు వల్లించిన జగన్ ఇప్పుడు చేసేది ఏంటి? అంటూ తెలుగుదేశం ప్రకటన ప్రశ్నించింది. “వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని టీడీపీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీన్ని పక్కదారి పట్టించడానికే టీడీపీ ఎమ్మెల్యేలతో బేరాలకు దిగుతున్నారు“ అంటూ ఆ ప్రకటనలో టీడీపీ పేర్కొంది. `భూ కుంభకోణాలు, ఇసుక, దళితులపై దాడులు చేయడంతో వైసీపీ నేతలపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఆ భయంతోనే ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్యేలను కొంటున్నారు. గ్రామస్థాయిలో టీడీపీ పటిష్టంగా ఉంది. ఏ ఒక్క కార్యకర్త కూడా వైసీపీ బెదిరింపులకు భయపడకుండా పోరాటం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల పార్టీ..నాయకుల పార్టీ కాదు.“ అంటూ టీడీపీ ప్రకటన పేర్కొంది. దీనిపై అధికార వైసీపీ స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.
వాసుపల్లి ఏమంటున్నారంటే
మరోవైపు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం తన గమనం పట్ల క్లారిటీతో ఉన్నట్లు చెప్తున్నారు. తనపై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్దమేనని ఆయన తేల్చిచెప్పారు. విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని వాసుపల్లి గణేష్ ప్రకటించారు. వచ్చే విశాఖ మేయర్ ఎన్నికల్లో నూరు శాతం సీట్లు గెలిపించుకునేలా కృషి చేసి జగన్ కు కానుకగా ఇస్తానని అన్నారు. అయితే, వాసుపల్లి గణేష్ ఇంత స్పష్టతతో ఉన్నందునే టీడీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తోందా? అనే చర్చ సైతం తెరమీదకు వస్తోంది.