గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పాలన వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
అన్యాక్రాంతమైన ఆలయాల భూములకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని త్వరలోనే మీడియా ముందుకు తెస్తానని అన్నారు. టీటీడీ అధికారులతోపాటు ముఖ్యమంత్రిపై కేసు పెడతానని, హైకోర్టులో కూడా కేసు వేస్తానని హెచ్చరించారు.
గోరంట్లలోని శ్రీ పద్మావతి అండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలీజియన్ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వరూపానందేంద్ర స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు. అంతేగాక, ప్రభుత్వ మార్పు కోసం త్వరలో ఏపీలో రాజశ్యామల యాగం చేస్తానని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావడానికి కారణం తాను దగ్గరుండి నిర్వహించిన రాజశ్యామల యాగమేనని తెలిపారు. ప్రస్తుతం స్వారూపానందేంద్ర స్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.