ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు కూడా జంపింగ్ కి సిద్ధమై పోయినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
తనను తప్పించి తన జిల్లాకే చెందిన అచ్చెన్నాయుడు కి పార్టీ అధ్యక్ష పదవి నివ్వడం కళా వెంకట్రావును కలచివేసిందని సమాచారం.నిజానికి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లాలో అతి సీనియర్ నాయకుడు.మధ్యలో ఒక్కసారి ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్లి రావడం తప్పితే ఆయన రాజకీయ జీవితమంతా టిడిపితోనే పెనవేసుకుంది.అచ్చెన్నాయుడు ఆయన ముందు అతి జూనియర్.కళా వెంకటరావు రాజకీయం మొదలెట్టినపుడు అచ్చెన్న ఏమీ కాడు, ఆయన అన్న ఎర్రన్నాయుడుతోనే కళా ఢీ కొట్టి మరీ పాలిటిక్స్ నడిపారు. ఇక ఎర్రన్నాయుడు జస్ట్ఒక ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే కళా వెంకటరావు హోం శాఖతో సహా కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.కళా వెంకట్రావు రాజకీయ చరిత్ర ఘనమయిందనే చెప్పాలి.
ఇంకా వెనక్కు వెళితే శ్రీకాకుళం జిల్లాటలో కళా వెంకటరావు కింజరపు ఎర్రనాయుడు వర్గాలు ఉండేవి. అయితే చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించి ఎర్రన్నాయుడు ను ఢిల్లీకి ఎంపీగా పంపడంతో శ్రీకాకుళం జిల్లాలో కళావెంకట్రావు హవా సాగేది. అయితే అచ్చం నాయుడు రాజకీయ రంగ ప్రవేశం తర్వాత కళావెంకట్రావు కు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. అయితే ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన కళా వెంకటరావు ఓడిపోవడంతో పాటు ఆ పార్టీ కూడా పరాజయం చెందడంతో మళ్లీ 2014 ఎన్నికలకు ముందు టిడిపికి వచ్చారు. తదుపరి పరిణామాలలో ఏపీ టీడీపీ చీఫ్ గా కళా వెంకట్రావు నియమితులయ్యారు చంద్రబాబు మంత్రివర్గంలో అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారు.
అయితే గత ఎన్నికల్లో ఏదో విధంగా అచ్చెనాయుడు గెలుపొందినప్పటికీ కళా వెంకట్రావు ఓడిపోవడంతో ఆయన డీలాపడారు.ఇంతలో చంద్రబాబు నాయుడు పార్టీ పదవి నుండి కూడా తనను తొలగించి తనకంటే జూనియర్ అయిన అచ్చెన్నాయుడుకు కిరీటం పెడుతుండటంతో కళా వెంకట్రావు తన రాజకీయ భవితవ్యంపై మధన పడుతున్నారని,ఇక టిడిపిలో ఉండి ప్రయోజనం లేదని భావిస్తున్నారని అయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారవచ్చనంటున్నారు.వెంకట్రావుకు వైసిపి తలుపులు తెరిచే అవకాశం ఉంది.ఆయన ఉత్తరాంధ్రలో బలమైన ఓటింగ్ బ్యాంకు ఉన్న తూర్పు కాపు.కాబట్టి వెంకట్రావు ని చేర్చుకుంటే తూర్పు కాపులను ఆకర్షించవచ్చునన్నది వైసీపీ వ్యూహం. ఒకటి రెండు వారాల్లో కళా వెంకట్రావు విషయంలో క్లారిటీ రావచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.