తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాల నిర్వహణ అంశంలో ఉన్నతాధికారుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయా.. అంటే పరిస్థితులు ఔననే అంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఈవో పదవి ఇటివల చేతులు మారింది. దాదాపు నాలుగేళ్లుగా ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇన్ చార్జి ఈవోగా అప్పటివరకూ జేఈఓగా ఉన్న ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయన బాధ్యతలు తీసుకుని మొత్తంగా వారం పూర్తయ్యేలోగానే పూర్తిస్థాయి జేఈఓగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. నవరాత్ర బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేలా చేసాయంటున్నారు.
భక్తుల మధ్య బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం..
ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు రెండుసార్లు వచ్చాయి. ఇటివలే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసాయి. కరోనా నేపథ్యంలో ఆలయం లోపల ఏకాంతంగా రంగనాయక మండపంలోనే వేడుకలు నిర్వహించారు. బ్రహ్మత్సవాలకు వచ్చే రద్దీ గురించి తెలిసి గత ఈఓ అనిల్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన బదిలీ అయ్యారు. ఈనెల 16 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వాహణపై నిర్ణయాన్ని ఇన్ చార్జి ఈఓ ధర్మారెడ్డి తీసుకున్నారు. అయితే.. ధర్మారెడ్డి ఇన్ చార్జి ఈఓనే అయినా.. బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షలు నిర్వహించారు. భక్తుల మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహంచాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల కోసం గ్యాలరీల్లో సామాజిక దూరం, ఎడం ఉండేలా మార్కింగులు చేయించారు. పరిమిత సంఖ్యలో భక్తులు, భజన బృందాలను పిలవాలని కూడా అనుకున్నారు.
నిర్ణయం మార్చేసిన ఈవో జవహర్ రెడ్డి..
కరోనా తీవ్రత తగ్గని ప్రస్తుత పరిస్థితుల్లో మాడవీధుల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణ సరైంది కాదు. కానీ ధర్మారెడ్డి నేతృత్వంలో నిర్ణయం జరిగింది. కానీ.. ఈలోపు జవహర్ రెడ్డి ఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రావడంతోనే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. మాడవీధుల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అయితే.. మాడవీధుల్లో బ్రహ్మోత్సవాల నిర్వహణపై వెనక్కు తగ్గారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకంతంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ధర్మారెడ్డి నిర్ణయాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య దూరం పెంచుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.