పండుగ వేళ కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11మంది అసువులు బాసారు. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. దర్వాడ్ జిల్లా లో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. దేవనగర్ నుండి బెళగావి వెళ్తున్న మినీ వ్యాన్ ను ఇట్టిగట్టి గ్రామం వద్ద టిప్పర్ లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ లో ప్రయాణిస్తున్న 11మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుబ్లీ లోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలియడంతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఘటన స్థలం కు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల అందరూ దావణగెరె కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఓ వేడుకకు గోవా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.