Supreme Court : ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్పై విచారణను సుప్రీం కోర్టు మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీప్ గా బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం..నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తొలుత తన సస్పెన్షన్ పై ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. తదుపరి ఏబీ వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని, పెండింగ్ జీత భత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే ప్రభుత్వం ఈ ఉత్తర్పులను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ఏడాది నుండి సస్పెన్షన్ పొడిగింపుపై సర్వీస్ నిబంధనలు చూపించాలని జస్టిస్ ఎంఎం ఖన్ విల్కర్, జస్టిస్ దివిశ్ మహేశ్వరి ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్ 3-1 కింద సస్పెన్షన్ పొడిగించామని ప్రభుత్వ తరపు న్యాయావాది ధర్మాసనానికి వివరించారు. రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరు నెలల తర్వాత పొడిగించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు పై అవినీతి చార్జి లేదని, రూల్ 3 లోని 1బి ప్రకారం ఏడాది కంటే ఎక్కువగా సస్పెన్షన్ ఉండటానికి వీలులేదని ఏబీవీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. అలాంటప్పుడు రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాల్ చేయలేదని ఏబీవీ తరపు న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయడానికి న్యాయవాది మూడు రోజులు గడువు కోరగా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రివ్యూ కమిటీ ఆదేశాలపై సవాల్ చేసిన మూడు రోజులలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది.