Sarpanch : వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న రెవెన్యూ ఇతర శాఖల అధికారులు లంచాలు తీసుకుంటుండగా లేనిది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన తాను లంచం తీసుకుంటే తప్పేముంది అనుకున్నాడో ఏమో కానీ ఓ గ్రామ సర్పంచ్ లక్షలాది రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వార్త తెలంగాణలో తీవ్ర కలకలాన్ని కల్గించింది. గత ఏడాది తెలంగాణలో రెవెన్యూ ఒకరు కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడిన ఉదంతం రెవెన్యూ వర్గాలను కుదిపేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ సర్పంచ్ బాగోతం వెలుగులోకి వచ్చింది.
విషయంలోకి వస్తే…వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన ఓ భూ యజమానికి వంద ఎకరాలకు పైగా పొలం ఉంది. ఆ భూమి మన్నెగూడ చౌరస్తా సమీపంలో ఉంది. ఇప్పటి వరకూ ఆ పొలంలో పండిస్తున్న ఆ భూ యజమాని ఇటీవల ఆ స్థలంలో ప్రధాన రహదారి వైపు 20 దుకాణాలతో ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశాడు. తన సొంత వ్యవసాయ భూమిలో షాపులు కట్టుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని భావించి షాపుల నిర్మాణం చేపట్టాడు. ఈ విషయం గ్రామ సర్పంచ్ కి తెలిసింది. వెంటనే పనులు ఆపమని చెప్పాడు.
షాపులు నిర్మించాలంటే పంచాయతీ అనుమతి తీసుకోవాలని అతనికి చెప్పాడు. పంచాయతీకి అనుమతుల కొరకు ధరఖాస్తు చేస్తానని అతను సమాధానం ఇచ్చాడు. ధరఖాస్తు ఇస్తే అనుమతులు ఇవ్వడం కుదరదు, అందుకు 20 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు సర్పంచ్. అంత మొత్తం ఇచ్చుకోలేనని రూ.15 లక్షల వరకూ ఇచ్చుకుంటానని సర్పంచ్ బేరం కుదుర్చుకున్నాడు భూ యజమాని. ఆ తరువాత ఆ భూ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించి తనను సర్పంచ్ 20 లక్షలు లంచం అడిగిన విషయంపై ఫిర్యాదు చేశాడు. ఎసీబీ అధికారులకు మంచి కేసు దొరకడంతో వెంటనే సర్పంచ్ ను రెడ్ హాండెడ్ గా పట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలో భూ యజమాని సర్పంచ్ కి ఫోన్ చేసి రాజేంద్ర నగర్ సమీపంలోని షాదాన్ కళాశాల వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని తెలియజేశాడు.
ప్లాన్ ప్రకారం భూ యజమాని షాదాన్ కళాశాల వద్దకు చేరుకున్న సర్పంచ్ కి కారులో రూ.13 లక్షలు నగదు ఇస్తుండగా అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారులు సర్పంచ్ ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. సర్పంచ్ పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో ఇలాంటి అవినీతి దందాలు నిత్యకృత్యం అయ్యాయి. కాకపోతే చాలా వరకు వెలుగు చూడటం లేదు.