KA Paul : కేఏ పాల్ …. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు . తనదైన శైలి నిర్ణయాలతో వార్తల్లో నిలిచే విభిన్న రాజకీయ వేత్త. ఒకింత గ్యాప్ తర్వాత కేఏ పాల్ తిరిగి మళ్లీ ఏపీ పరిణామాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, తనకు పరాభవం జరగడంతో ఆయన హర్టయ్యారు. అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎవరిపై అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై.
KA Paul అసలేం జరిగింది?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వివిధ వర్గాలు వీరికి మద్దతు ఇస్తున్నాయి. ఇదే ఒరవడిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలకు కేఈ పాల్ మద్దతు ప్రకటించారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం నుంచి కార్మికుల నిరసనలకు మద్దతుగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. దీంతో కార్మిక సంఘాల నేతలు కేఏపాల్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రకటన తర్వాతే తాను హర్టయ్యానని పాల్ ప్రకటించారు.
వాళ్లేం చేశారో తెలుసా?
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అండగా ఉంటానని.. ఎలాంటి పోరాటానికైనా రెడీగా ఉన్నానని కేఏ తెలిపారు. ఢిల్లీ వచ్చిన కార్మిక సంఘం నేతలు తనను కలవకపోవడంపై కేఏ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కార్మిక సంఘాలకు అండగా ఉంటానంటే కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు వచ్చి తనను కలిస్తేనే.. ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతానని తెలిపారు. ప్రైవేటీకరణ అంశంలో రాజకీయ నాయకులు అమ్ముడు పోయారని కేఏ పాల్ ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అండగా ఉండేందుకు తాను అమెరికా నుంచి ఢిల్లీ వచ్చానని తెలిపారు.