Wrestler: ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద గత రాత్రి జరిగిన ఘర్షణలో 24 ఏళ్ళ ఓ రెజ్లర్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో భారత ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పాత్ర ఉందా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆయనపై దర్యాప్తు ప్రారంభమైనట్టు తెలుస్తోందని ఓ డైలీ తన పత్రికలో రాసుకొచ్చింది. నిన్న రాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న రెజ్లర్ ని వినాయక్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కొడుకైన ఇతడిని సాగర్ కుమార్ గా, గాయపడిన మరో వ్యక్తిని సోను మహల్ గా గుర్తించినట్టు పోలీసులు చెబుతున్నారు. సుశీల్ కుమార్ కు చెందిన ఈ స్టేడియం బయట ఓ ఇంటిలో సాగర్ కుమార్ తో సహా మరో ఇద్దరు ఉండగా వారిని వెళ్లిపోవాలని సుశీల్ కుమార్ కోరాడని తెలుస్తోంది. కానీ ఏం జరిగిందో గానీ పరిస్థితి ఘర్షణకు దారి తీయగా సాగర్ కుమార్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్టు తెలిసింది.
వారిలో వారే ఘర్షణ పడ్డారు!
కాగా వారెవరో తనకు తెలియదని, ఈ ఘటన చాలా పొద్దుపోయిన తరువాత జరిగిందని సుశీల్ కుమార్ అంటున్నాడు. వారు ఘర్షణకు దిగినట్టు తెలియడంతో సమాచారాన్ని తాను పోలీసులకు తెలియజేశానని ఆయన చెప్పాడు. తన స్టేడియానికి, ఈ ఘటనకు సంబంధం లేదని అన్నాడు. కానీ ఈ వ్యవహారంలో ఇతని రోల్ కూడా ఉందా అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.పైగా మరణించిన సాగర్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా వారు ఇప్పటికే స్వాధీనపర్చుకున్నట్టు సమాచారం.ఒకట్రెండు రోజుల్లో విచారణ కొలిక్కి రాగలదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
సుశీల్ కుమార్ ఒలింపిక్స్ మెడలిస్ట్!
సుశీల్ కుమార్ పాపులర్ రెజ్లర్.. 2008 లో జరిగిన బీజింగ్ ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని, 2012 లో లండన్ లో జరిగిన ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించాడు.కాగా తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.