Karnataka Oxygen Issue: కర్నాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా పెంచాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం సవాల్ చేసి భంగపడింది. కర్నాటక హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోవడానికి తగిన కారణం ఏమి తమకు కనిపించడం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.
దేశంలో కోవిడ్ 19 వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో కర్నాటక ఒకటి. ప్రధానంగా కర్నాటక రాజధాని బెంగళూరులో అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజు వారి నమోదు కేసులు 50వేలకు చేరువ అయ్యింది. గడచిన 24 గంటల్లో 328 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
ఈ నేపథ్యంలో మే 5న కర్నాటక హైకోర్టు కేంద్రానికి ఆక్సిజన్ కోటాను పెంచాలని ఆదేశించింది. రోజు వారి ఆక్సిజన్ సరఫరాను 1,200 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేంద్రం దాఖలు చేసిన ఈ పిటిషన్ పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైకోర్టు బాగా ఆలోచించి జాగ్రత్తగా చక్కని ఆదేశాలు జారీ చేసిందనీ, ఈ ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణం కనబడటం లేదని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రానికి రోజువారీ 965 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని వివరించారు. ప్రతి హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే దేశంలో ఆక్సిజన్ పంపిణీ, నిర్వహణలో అరాచకం ప్రబలుతుందనీ, ఈ అదేశాలు సహేతుకం కాదని పేర్కొన్నారు. కర్నాటక ప్రభుత్వంతో కేంద్రం సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఆక్సిజన్ సమస్యలపై తమిళనాడు, తెలంగాణ ఇతత హైకోర్టులు కూడా విచారణ జరుపుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓ దశలో రాష్ట్రాలకు ఆక్సిజన్ హైకోర్టులనే పంపిణీ చేయమనండి అంటూ వ్యాఖ్యానించారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ హైకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసిందనీ, అయితే అవసరమైన సమయంలో జోక్యం చేసుకుంటామని పేర్కొన్నారు.