MP RRR Case: వైసీపీ ఎంపి రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం నేరుగా జిల్లా జైలుకు తీసుకువెళ్లారు. రఘురామ కృష్ణరాజు తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధ్రోహం తదితర సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును ఏపి సీఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు జీజీహెచ్ లో పరీక్షల అనంతరం రమేష్ ఆసుపత్రికి ఆయనను తలిస్తారని అందరూ భావించారు. అయితే జీజీహెచ్ లోనే శనివారం రాత్రి నుండి ఉదయం వరకూ అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు.
మరో పక్క సీఐడీ న్యాయస్థానం నియమించిన మెడికల్ బోర్డు తమ నివేదికను సిద్ధం చేసి సీల్డ్ కవర్ లో జిల్లా మెజిస్టేట్ కు అందజేసింది. ఈ నివేదిక జిల్లా మెజిస్ట్రేట్ నుండి హైకోర్టు డివిజన్ బెంచ్ కు చేరనున్నది. మెడికల్ బోర్డు రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. పోలీసులు కొట్టారు అంటూ రఘురామకృష్ణం రాజు చేసిన ఆరోపణలు నిజం ఉందా లేదా అనేది మెడికల్ రిపోర్టులో తేలనున్నది. జీజీహెచ్ వైద్యులు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లుగా రిపోర్టు ఇచ్చి ఉంటారనీ, అందువల్లనే రమేష్ ఆసుపత్రికి తరలించకుండా, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినందున పోలీసులు ఆయనను జిల్లా జైలుకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.