Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇరకాటంలో పెట్టడంలో ముందుండే వారిలో ఒకరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా మరోమారు అదే తరహా నిర్ణయం తీసుకున్నారు. కరోనా విపత్తుతో ప్రజలు చితికిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కి ఈ మెయిల్ ద్వార వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి దాదాపు ఏడాదవుతున్నా ఇంతవరకు అమలు చేయడం లేదని పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంలో తగు రీతిలో స్పందించాలన్నారు.
బండి సంజయ్ ఘాటు లేఖ…
గత ఏడాది డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్సులో పాల్గొన్న రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తామని చెప్పారని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రధానికి మాట ఇచ్చిన దిశలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని బండిసంజయ్ విమర్శించారు. ఏడాది కాలంగా కరోనాను ‘ఆరోగ్య శ్రీ’లో చేర్చాలన్న డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయడం లేదని గవర్నర్కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ సర్కారు విఫలం…
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో గ్రామీణులు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రైవేటులో చికిత్స చేయించుకునేందుకు పేదలు ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పుల్లో కూరుకుపోతున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పథకం ‘ఆయుష్మాన్ భారత్’లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్టు ‘ఆరోగ్య శ్రీ’ కింద ఉచితంగా కరోనా చికిత్స చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కీలక అంశాలు
రాష్ట్రంలో వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్ నిర్లక్ష్యం చూపడం వల్లే పేదలకు కరోనా కష్టాలు మరింత పెరిగాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవు, గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలు, మధ్య తరగతి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, అలాగే వెంటనే ఆలస్యం చేయకుండా తెలంగాణలో ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అమలు చేయాలన్నారు.