Black Fungus: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్తో అల్లాడుతున్న ప్రజానీకానికి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తుండటంతో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఏపిలోనూ బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యాధి లక్షణాలతో ఏపిలో ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందినట్లు సమాచారం. అధికారికంగా పదికి పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. పలువురు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు మృతి చెందారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు బ్లాక్ ఫంగస్ గుప్పిట్లో చిక్కుకున్నట్లు కన్పిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా బయటపడుతుండటంతో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా కేసుల్లో కరోనా నుండి కోలుకున్న తరువాత ముక్కు, చెవి, గొంతు ద్వారా సంక్రమించే ఈ ఫంగస్ చివరకు ప్రాణాంతకం అవుతోంది. కోవిడ్ తగ్గింది అనుకున్న వారిలో కన్ను, దవడ వాపు లక్షణాలు కొందరిలో వస్తున్నాయి. అయితే ఈ బ్లాక్ ఫంగస్ పై పూర్తిగా అవగాహన లేకపోవడంతో ఈఎన్టీ సమస్యలు ఉన్న వారు తమకు బ్లాక్ ఫంగస్ ఉందన్న భయంతో ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.
Black Fungus: బ్లాక్ ఫంగస్ అంటే ..
బ్లాక్ ఫంగస్ ను వైద్య పరిభాషలో మ్యూకార్ మైకోసిస్ గా పిలుస్తుంటారు. కళ్లు, మెదడుపై దాడి చేసే ఈ ఫంగస్ ను సకాలంలో గుర్తించకపోతే చివరకు ప్రాణాలను హరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఈఎన్టీ నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవాలి. ఏపిలో బ్లాక్ ఫంగస్ ప్రమాదం పొంచి ఉన్న మాట వాస్తవమేనని ఆంధ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆసుపత్రి యాజమాన్యాలకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కోరారు.