VH Vs Revanth Reddy: తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) మరో మారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో రాజకీయాలు జోరందుకున్నారు. పీసీసీ రేస్ లో రేవంత్ రెడ్డి పేరు వినబడుతున్న నేపథ్యంలో వీహెచ్ తన దైన శైలిలో విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్లకు పీసీసీ ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. టీడీపీని నాశనం చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన వీహెచ్.. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక ఆయన జైలుకు వెళితే పార్టీ జైలు చుట్టూ తిరగాలా అని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని రేపు రేవంత్ జైలుకు వెళితే కాంగ్రెస్ నేతలు జైలు చుట్టూ తిరగాలా అని ఎద్దేవా చేశారు. తనను ఇప్పటి వరకూ ఎవరూ తిట్టిన వాళ్లు లేరనీ, కానీ నాలుగైదు పార్టీలు మారిన వారు తిడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ పై ఆరోపణలు ఉన్నాయని తాను అంటే ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని ఇలాంటి ఘటనలను జానారెడ్డి ఒక్కరే ఖండించారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు అసలు స్పందించడం లేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ని విమర్శించినప్పుడు తనకు కడప నుండి ఎటువంటి బెదిరింపులు రాలేదని వీహెచ్ అన్నారు.రేవంత్ పెద్ద నాయకుడు అని చెబుతున్న వాళ్లు గ్రేటర్ లో ఎన్ని గెలిపించారని వీహెచ్ ప్రశ్నించారు. పీసీసీ అయితే టీడీపీ కాంగ్రెస్ చేస్తావా అంటూ వీహెచ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ అధిష్టానం ఇస్తే పీసీసీ బీసీలకు ఇవ్వాలి లేకుంటే కోమటిరెడ్డికి ఇవ్వాలని విహెచ్ సూచించారు.