10th, Inter Exams: ఏపిలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నది. పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి డిమాండ్ వస్తున్నా విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షల రద్దు మంచి పద్ధతి కాదన్నది ప్రభుత్వ వాదన. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ టెన్త్, 12 తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. మెజార్టీ రాష్ట్రాల్లోనూ కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేశాయి. ఏపిలోనూ పరీక్షలు రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్ కు తలవొగ్గి రద్దు చేసినట్లు అవుతుందనీ, దానిపై క్రెడిట్ వారికి దక్కుతుందన్న భావనతోనే వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలను బట్టి చూస్తే ప్రభుత్వం పరీక్షలపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నట్లుగా కనబడుతోంది.
తాజాగా నేడు పరీక్షల నిర్వహణపై మంత్రి సురేష్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందనీ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Read More: AP High Court: సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..!!
ఇంటర్ పరీక్షలు బహుశా జులై మొదటి వారంలో జరగవచ్చని వెల్లడించిన ఆయన జూలై చివరి వారంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. జూలై నెలలో పరీక్షలు నిర్వహణ సాధ్యపడకపోతే ఇక అవకాశం ఉండదని భావిస్తున్నామన్నారు. తాము కఛ్చితంగా జూలై నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం లేదన్నారు. అవకాశం ఉందని మాత్రమే చెబుతున్నానని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నామని చెప్పారు. పరీక్షలు రద్దు చేయడం పెద్ద పని కాదనీ, కానీ తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
కేరళ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు పరీక్షలు జరిపాయని గుర్తు చేస్తూ చత్తీస్గఢ్ రాష్ట్రంలో పరీక్షలు జరుపుతోందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుని కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి రాష్ట్రంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సురేష్ వెల్లడించారు.