Corona Vaccine: కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సెకండ్ వేవ్ ముగిసింది.. మధ్యలో బ్లాక్, వైట్, డెల్టా అంటూ పలు వేరియంట్లు విన్పించాయి.. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక వ్యాక్సిన్ వేయించుకుంటే వైరస్ చాలా వరకు సోకకుండా ఉంటుందని అంచనా వేశారు ఆరోగ్య నిపుణులు.. అయితే తాజాగా కేరళలో కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 40వేల మందికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది..!!
కేరళలో కరోనా కొత్త వేరియంట్లు వణుకు పుట్టిస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 40వేల మందికిపైగా కేరళీయులకు ‘పాజిటివ్’ నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.. దేశవ్యాప్తంగా ఇటువంటివి సుమారు లక్ష కేసులను గుర్తించారు. అందులో 40వేలు కేరళలోనే నమోదయ్యాయి.. ఆ 40వేల మంది కరోనా శాంపిళ్లను సేకరించి, జీనోమిక్ సీక్వెన్సింగ్ కు పంపించారు.. ఆ నివేదిక వచ్చిన తర్వాత కేరళలో ఏ వేరియంట్ వ్యాపిస్తోంది? అది కొత్త వేరియంటా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది..
అలాగే బెంగళూరులో గత 5 రోజుల్లో సుమారు 242 మంది చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ సూచనలు కరోనా థర్డ్ వేవ్కు సంకేతమే అయి ఉండొచ్చనే ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో కర్ణాటకలో 1338 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసులు 140 రోజుల కనిష్టానికి తగ్గి 3,86,351కి చేరాయి. గత 24 గంటల్లో 38,353 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3.20 కోట్లు దాటింది. 497 మంది కొవిడ్తో మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,29,179కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 17.77 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 48.50 కోట్లకు పెరిగింది.