ఔరంగాబాద్: ఎన్నికలొచ్చాయంటే పార్టీల్లో అసంతృప్తి సెగలు భగ్గుమంటాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్స్గా బరిలోకి దిగడం, పార్టీ మారడం సర్వ సాధారణం అయిపోయింది.
అలాగే కొందరు పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతుంటారు. మరికొందరు కార్యాలయాలపై దాడులకు దిగి కుర్చీలు, ఫర్నీచర్ను ధ్వంసం చేస్తుంటారు. కానీ మహారాష్ట్రలోని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. టికెట్ దక్కలేదన్న కోపంతో పార్టీ ఆఫీసులో కుర్చీలు ఎత్తుకెళ్లారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన హాట్టాపిక్ అయ్యింది.
సిల్లోద్ ఎమ్మెల్యే సత్తార్కు ఔరంగాబాద్ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగాలని ఆశపడ్డారు. ఔరంగాబాద్ టికెట్ కావాలని సత్తార్ కొంతకాలంగా పార్టీ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. టికెట్ కచ్చితంగా తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం ఆయన్ను కాదని ఎమ్మెల్యే సుభాష్ జాంబాద్కు టికెట్ కేటాయించింది. దీంతో సత్తార్, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
ఇదే సమయంలో షాగుంజ్ ప్రాంతంలోని కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీ భవన్లో పార్టీ స్థానిక విభాగం నేతలు ఎన్సిపి నేతలతో కలిసి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సత్తార్, ఆయన అనుచరులు సమావేశానికి కొద్దిసేపు ముందుకు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న మూడు వందల కుర్చీలను ఎత్తుకెళ్లిపోయారు. సత్తార్ కుర్చీలు ఎత్తుకెళ్లడంతో గాంధీ భవన్లో కాంగ్రెస్-ఎన్సిపి నేతల సమావేశం ఆగిపోయింది. సమావేశ స్థలాన్ని ఎన్సిపి కార్యాలయాని మార్చేశారు.
మరోవైపు దీనిపై సత్తార్ స్పందించారు. ఆ కుర్చీలు తనవేననీ, కాంగ్రెస్ సమావేశాల కోసం తీసుకొచ్చానని సత్తార్ చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్కు రాజీనామా చేశానని అందుకే తన కుర్చీలు తాను తీసుకెళ్లిపోయానని సత్తార్ పేర్కొన్నారు.
సత్తార్ చేసిన పనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. తనకు అవసరమై సత్తార్ ఆ కుర్చీలు తీసుకెళ్లి ఉంటారని నేతలు అంటున్నారు. ఆయన రాజీనామాను కూడా ఇంకా ఆమోదించలేదని వారు తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని నేతలు పేర్కొన్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!