AP High Court: రాజధాని ప్రాంత అమరావతి రైతులకు ఏపి హైకోర్టు గుడ్ న్యూస్ అందించింది. అమరావతి ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుండి తిరుమల వరకూ మహాపాద యాత్ర చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే రైతులు పాదయాత్ర చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారి పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. జేేఏసీ నేతలకు పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని డీజీపీ స్పష్టం చేస్తూ లేఖ అందించారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి జేఏసి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు కోర్టు విచారణ చేపట్టింది.,
AP High Court: షరతులతో మహాపాదయాత్రకు అనుమతి
ఈ పిటిషన్ పై రైతులు పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి, పోలీసులకు ఏమిటి అభ్యంతరం అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు గ్రామాల్లోకి వెళితే వారిపై రాళ్లు విసిరే ప్రమాదం ఉందని, రైతుల పాదయాత్రతో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. రైతుల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ దీనిపై వాదనలు వినిపిస్తూ రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని తెలియజేస్తూ..అనుమతి ఇవ్వలేమంటూ డీజీపీ రాసిన లేఖలో సరైన కారణాలు చూపలేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రైతుల పాదయాత్రకు షరతులతో కోర్టు అనుమతి ఇచ్చింది.
నవంబర్ 1 నుండి 45 రోజులు పాదయాత్ర
రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 17 వరకూ 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసి, రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క రైతులు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరో పక్క న్యాయపోరాటం చేస్తున్నారు. మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా కూడా కొందరు కొద్ది రోజులు శిబిరాన్ని నిర్వహించారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం హైకోర్టు విచారణలో ఉంది.