Army Chopper Crash: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత త్రివిధ దళాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. కోయంబత్తూర్ – కూనూరు మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ హెలికాఫ్టర్ లో బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఆర్మీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుండి బయలుదేరిన ఎంఐ సిరీస్ హెలికాఫ్టర్ కొద్దిసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలింది. ఘటనా స్థలం నుండి ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదాన్ని భారత వాయుసేన కూడా దృవీకరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ ఘటనపై కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాన నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాన మంత్రి మోడీకి వివరించినట్లు సమాచారం. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనపై మరి కొద్దిసేపటిలో రాజ్ నాథ్ సింగ్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Army Chopper Crash: హెలికాఫ్టర్ లో ఉన్నది వీరే..
ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో బిపిన్ రావత్, ఆయన భార్య మథులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు. బిపిన్ రావత్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా వ్యవహరిస్తున్నారు. భారత్ కు తొలి సీడిఎస్ ఆయనే. భారత్ లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి ఆయనే. జనరల్ రావత్ డిసెంబర్ 31 న ఆర్మీ చీఫ్ పదవికి నుండి పదవీ విరమణ అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ తొలి సీడీఎస్ గా నియమించింది. 1978 డిసెంబర్ లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుండి గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు.