Vangaveeti Radha: వంగవీటి రాధా కృష్ణపై రెక్కీ జరిగినట్లు నిర్ధిష్ట ఆధారం లభించలేదని విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) క్రాంతి రాణా అన్నారు. ఇటీవల దివంగత వంగవీటి రంగా వర్థంతి సభలో తనపై రెక్కీ జరిగినట్లు వంగవీటి రాధ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన సీ ఎం వైఎస్ జగన్.. రాధకు 2 ప్లస్ 2 గన్ మెన్ ల భద్రతకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా సీఎం ఆదేశాల మేరకు రెక్కీపై ఇంటెలిజెన్స్, పోలీసు విచారణ జరిపారు. తాజాగా వంగవీటి రాధాను టీ డీ పీ అధినేత చంద్రబాబు పరామర్శించి రెక్కీకి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో వంగవీటి రాధపై జరిగిన రెక్కీ విషయంలో పోలీసులు ఇంత వరకు దోషులను గుర్తించకపోవడాన్ని తప్పుబట్టారు. దీనిపై స్పందించిన విజయవాడ సీపీ క్రాంతి రాణా చంద్రబాబు పోలీసులపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
రాధా రెక్కీ చేశారన్న వ్యాఖ్యలపై విచారణ జరిపామని సీపీ తెలిపారు. అయితే ఇంత వరకూ నిర్ధిష్టమైన ఆధారాలు లభించలేదని అన్నారు. రాధాకు గన్ మెన్ లను కేటాయించామనీ, నగర పోలీసులు కూడా ఆయనకు భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. అయితే ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని అన్నారు. రాధా హత్యకు రెక్కీపై ఎవరైనా సమాచారం ఇస్తే విచారణ చేస్తామని అన్నారు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించామనీ, రెండు నెలల పుటేజ్ ఉందని తెలిపారు. రాధా ఇంటి వద్ద చక్కర్లు కొట్టాయన్న వాహనాలపై వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు, తమ సిబ్బంది రాధాను కలిసి మాట్లాడి వివరాలు తీసుకున్నారని సీపీ తెలిపారు.