Ganta Srinivasarao: ఏపి రాజకీయాలను ప్రభావితం చేసే ఓ కీలక మీటింగ్ హైదరాబాద్ లో ఇటీవల జరిగింది. ఈ మీటింగ్ లో కాపు సామాజికవర్గ నాయకులు గంటా శ్రీనివాసరావు, తోట చంద్రశేఖర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి వివి (జేడి) లక్ష్మీనారాయణ, ఆలేటి ప్రకాశం, కన్నా లక్ష్మీనారాయణ ఇలా కాపు సామాజికవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశ ఏజెండాపై భిన్నవాదనలు తెరపైకి వస్తున్నా వాస్తవంగా వారు ఎందుకు మీటింగ్ నిర్వహించుకున్నారు..? వారి వ్యూహం ఏమిటి..? దాన్ని నడిపించింది ఎవరు..? అనే విషయాలను పరిశీలిస్తే.. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహం ఇతర నేతలకు భిన్నంగా ఉంటుంది. ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఆయనకు నియోజకవర్గంతో సంబంధం ఉండదు..! పార్టీతో సంబంధం లేదు..! ఆయన గెలవాలి..! ఆయన పెత్తనం కొనసాగాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి తన పెత్తనం చెలాయించడం ఆయన రాజకీయ శైలి. ఏదైనా రాజకీయ నాయకుడు ఆదర్శవంతంగా ఉండాలంటే ఒకే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని గెలిచినా ఓడినా ఆ నియోజకవర్గ ప్రజలతో సేవలు అందించాలి. అటాచ్ మెంట్ కొనసాగించాలి. దానికి పూర్తి విరుద్దం గంటా శ్రీనివాసరావు.
గంటా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత వరుసగా నియోజకవర్గాలు మారుతూ, పార్టీలు మారుతూ గెలుస్తూ వస్తున్నారు. ఇది ఆయన రాజకీయం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన గంటా శ్రీనివాసరావు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలో చేరి మరల చక్రం తిప్పాలని భావించారు. కానీ జగన్మోహనరెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఒక వేళ వచ్చినా పెత్తనం లేకుండా సైలెంట్ ఉంటానంటే రావాలని జగన్ కండిషన్ పెట్టారు. దీంతో గంటా వైసీపీలో చేరిక కుదరలేదు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో కాపు సామాజిక వర్గ నేతలందరినీ ఏకం చేసి ఇటు టీడీపీ లేదా అటు వైసీపీతో బేరం స్టార్ట్ చేసే పనిలో నిమగ్నమైనట్లు వార్తలు వస్తున్నాయి. బేరం అంటే మా సామాజికవర్గ బలం ఇంత ఉంది, మాకు ఇన్ని నియోజకవర్గాలు కావాలి అని డిమాండ్ చేయడం.. ఒక పార్టీ ఒప్పుకోకపోతే మరో పార్టీ వద్ద ఈ రకమైన ప్రతిపాదన తీసుకురావడం, వాళ్లు చెప్పిన వాళ్లకు సీట్లు ఇవ్వడానికి ఆ రాజకీయ పార్టీలు ఒప్పుకోకపోతే సామాజికవర్గంగా పోటీ చేస్తామని చెప్పడం, ఇది వీళ్ల అజెండా. వాస్తవానికి ఏపిలో కాపు సామాజికవర్గం రాజకీయంగా వెనుకబడి పోతోంది.
రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం 4.5 శాతం, రెడ్డి సామాజికవర్గం 6 శాతం మాత్రమే ఉన్నా రాజకీయంగా అధికారిక పెత్తనం ఆ సామాజికవర్గాల చేతిలో ఉందన్న భావన ఉంది. కాపు సామాజికవర్గ బలం 13 శాతం పైగా ఉన్నా మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చన అన్న సామెత మాదిరిగా ఐక్యత లోపించడం వల్ల రాజ్యాధికారం సాధించలేకపోతున్నారని టాక్. ఈ సామాజికవర్గంలో భిన్న నాయకత్వం ఉండటం ఒక డ్రాబ్యాక్ గా భావిస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినా, జనసేన పవన్ కళ్యాణ్ వచ్చినా నాయకత్వ విభేదాల కారణంగా మొత్తం సామాజికవర్గం వారి పక్కకు చేరలేదు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు తెరవెనుక ఉండి ఈ కూటమిని నడిపిస్తున్నారు. జనసేన – టీడీపీ కూటమిగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాపు సామాజికవర్గం అటువైపు వెళ్లకుండా చేసి పరోక్షంగా వైసీపీకి లాభం చేకూర్చే ఆలోచన వీళ్లు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గంటా శ్రీనివాసరావు, వంగవీటి రాధకు టీడీపీ ఓ కీలక బాధ్యతను అప్పగిస్తే దాన్ని మధ్యలోనే వదిలివేసి తన రాజకీయ వ్యూహంలో భాగంగా కొత్త అజెండాను తీసుకువచ్చారన్న వార్తలు షికారు చేస్తున్నాయి.