విజయనగరం : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్పి ఠాకూర్ వాహనాన్ని సైతం ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు మగళవారం తనిఖీ చేశారు. ఎస్కోట మీదగా అరకు వెళ్తుండగా విజయనగరం జిల్లా బొడ్డవరం వద్ద ఆర్పి ఠాకూర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
ఆర్పి ఠాకూర్ అధికార టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ, తన వాహనంలోనే నియోజకవర్గాలకు డబ్బును తరలిస్తున్నారని వైసిపి ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే దీనిపై వైసిపి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఠాకూర్ను బదిలీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఠాకూర్ వాహనాన్ని తనిఖీ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.