YS Sunitha: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సీరియస్ గా తీసుకుని విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ హత్యను ఎవరు చేశారు..? ఎవరు చేయించారు.. ? అనేది నిగ్గు తేల్చడానికి, అంత పెద్ద పెద్ద వ్యక్తులను కూడా అందరికీ తెలిసేలా బయట పెట్టడానికి సీబీఐ ముందుకు వచ్చింది అంటే దానికి ఏకైక కారణం డాక్టర్ సునీతా రెడ్డి మాత్రమే అని చెప్పవచ్చు. సునీతా రెడ్డి ఈ కేసును పట్టించుకోకపోతే ఎప్పుడో తెరమరుగు అయిపోయేది. ఎవరు చంపారు..? ఎవరు చంపించారు..? అనే నిజాలు ఎవరికీ తెలిసేవి కూడా కాదు. వివేకా కుమార్తెగా డాక్టర్ సునీతా రెడ్డి .. తన తండ్రి మరణానికి కారకులైన వారికి చట్టపరంగా శిక్షపడాలన్న ఏకైక అజెండా, ఏకైక లక్ష్యంతో గత రెండు సంవత్సరాల నుండి సమాజంలో కొంత మంది పెద్ద వ్యక్తులు, కుటుంబంలోని వ్యక్తులతో పోరాడుతున్నారు.
YS Sunitha: లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు సునీతా రెడ్డి లేఖ
ఆమె ఒక వర్గంతో కలిసిపోయారని, ఒక మీడియాతో కలిసి పోయారని, ఒక నాయకుడితో కలిసిపోయారని వైసీపీ అనేక ఆరోపణలు చేస్తున్నా ఆమె అవేమీ పట్టించుకోకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. సీబీఐయే నిజాలను వెలికి తీస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు కూడా సునీతా రెడ్డి లేఖ రాశారు. నిజానికి సునీతా రెడ్డి తన తండ్రి మరణానికి సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేయకపోతే ఈ కేసు ఏమయ్యోదో అందరికీ తెలుసు. ఆమె 2019 డిసెంబర్ వరకూ నిందితులను పట్టుకుంటారు అని ఎదురు చూశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేసులో వేగం పుంజుకోకపోవడంతో సీబీఐ విచారణకు ఆమె డిమాండ్ చేశారు. సునీతారెడ్డి వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ సీబీఐ విచారణ అవసరం లేదని వాదనలు వినిపించింది. సిట్ బృందమే దర్యాప్తు పూర్తి చేస్తోంది అని చెప్పింది.
YS Sunitha: వివేకా హత్య పై వారు తేలికగా స్పందించారు.
ఇప్పుడు తాజాగా సునీతారెడ్డి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం కల్గించింది. తన తండ్రి వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలంతో పాటు నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను జత చేశారు. ఇదే క్రమంలో సీబీఐకి సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు పరిశీలిస్తే.. “మా నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసు. నాన్న హత్య పై భారతి, జగన్ చాలా తేలికగా స్పందించారు. నాన్న హత్య కేసులో జగనన్న వ్యాఖ్యలు బాదించాయి. హత్య గురించి అనుమానితుల పేర్లు జగనన్నకు చెప్పాను. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారు. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్ కు ఏమీ కాదు. బీజేపిలో చేరతాడు. ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి. ఇది 12వది అవుతుంది” అని అన్నారు.
అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయి
“నా తండ్రి హత్యను జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారు. సీబీఐ విచారణకు నేను కోర్టుకు వెళితే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వద్దన్నారు. అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలు ఆధారాలు మాయం చేశారు. వీరితో పాటు మరి కొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయి. నా తండ్రి అంటే ఎంపి అవినాష్ రెడ్డికి గిట్టదు. హంతకులకు శిక్ష పడాలని గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించాను” అని సునీతారెడ్డి పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో వైఎస్ షర్మిల, విజయమ్మ పేర్లను ప్రస్తావించారు సునీతా రెడ్డి. కడప ఎంపి సీటు విషయంలో అంతర్గతంగా జరిగిన సంభాషణను వివరించారు.