కేరళ: దక్షిణాదిలో ప్రచారం జాతీయ పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా అగ్ర నేతల ప్రసంగాలను తర్జుమా చేయటంలో స్థానిక నేతలు ఇబ్బందిపడుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇలాంటి సమస్యే ఎదురు కాగా అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్నారు. నిన్న పథనంథిట్ట, అలప్పుళా ప్రాంతాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే పథనంథిట్ట ఎన్నికల ర్యాలీలో రాహుల్ కాస్త ఇబ్బందికి గురయ్యారు. రాహుల్ ఇంగ్లీష్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ డిప్యుటీ ఛైర్మన్ పిజె కురియన్ మళయాలంలోకి అనువదించారు.
ప్రసంగం ఆరంభంలో రాహుల్ చెబుతున్న మాటలు కురియన్కు సరిగ్గా వినబడలేదు. దీంతో రాహుల్ తన మాటలను పదే పదే చెప్పాల్సి వచ్చింది. రాహుల్ చెప్పింది అర్థంకాక కురియన్ కొన్ని సార్లు తప్పుగా అనువదించారు.
ఒకానొక సందర్భలో కురియన్ మైక్ను పక్కకు పెట్టి రాహుల్ చెప్పింది విని, మళయాలంలో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే రాహుల్ ఆ మైక్ని తిరిగి కురియన్కి దగ్గరగా జరపడం తెగ నవ్వు తెప్పిస్తుంది. రాహుల్ ఆపకుండా ప్రసంగం చేస్తుంటే అది అర్థం చేసుకోవడానికి తరచూ కురియన్ చూపించిన హావభావాలు కామెడీని పూయించాయి. రాహుల్గాంధీ కూడా కురియన్ హావభావాలు చూసి నవ్వుతూ కనిపించారు.
మైక్లో సాంకేతిక సమస్య, ప్రతిధ్వని కారణంగా తనకు వినిపించట్లేదని కురియన్ చెప్పారు. అయితే అనువాదం సరిగ్గా లేకపోవడంతో ఒక దశలో రాహుల్ కాస్త అసహనానికి గురైనట్లు కన్పించారు. కురియన్ బదులుగా మరొక అనువాదకుడిని ఏర్పాటు చేయమని కోరినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది సేపటి తర్వాత సిబ్బంది వచ్చి మైక్ను సరిచేయడంతో కురియన్ అనువాదం చేయగలిగారు. అనంతరం రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
సిపిఐ అగ్రనేత బృందా కారత్కు కూడా కేరళలో ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆమె ప్రసంగాన్ని తర్జుమా చేయటంలో స్థానిక నేతలు విఫలం అయ్యారు. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు.