NTR: ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడానికి వైసీపీ ప్రభుత్వం బిల్లు తీసుకురావడం.. ఆమోదం కూడా పొందుకోవడం జరిగింది. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో టీడీపీ, మిగతా పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు.. స్పందించి ఎన్టీఆర్ పేరు తొలగింపు దివాలా కొరితనానికి నిదర్శనమని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య విద్యకి ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలన్న సంకల్పంతో 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఈ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభించారు.
అనంతరం ఆయన మరణించాక ఎన్టీఆర్ జ్ఞాపకార్థం 1998లో ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు చంద్రబాబు తెలియజేశారు. 36 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి.. వైయస్సార్ పేరు ఎలా పెడతారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఇంకా.. నందమూరి కుటుంబ సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అన్ని కులాలు, మతాలు పార్టీలకు చెందిన వ్యక్తి. ఆయన పేరుని ఎలా తొలగిస్తారు అని ఎన్టీఆర్ కుటుంబం ఖండించడం జరిగింది.
కాగా తాజాగా ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ విశేష ప్రజాధరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైయస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపి వేయలేరు అని తారక్ స్పందించడం జరిగింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.