తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈటెల రాజేందర్ మళ్లీ సొంత గూటికి చేరబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. టీఆర్ఎస్ బహిష్కరించిన తర్వాత ఆయనకు బీజేపీ షల్టర్ ఇవ్వడంతో పాటు వ్యవస్థల సహకారం అందించింది. హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి ఘన విజయం సాధించి తన సత్తా ఏమిటో కేసిఆర్ కు చూపించారు ఈటెల. అటువంటి ఈటెల రాజేందర్ మళ్లీ వెనక్కు వెళ్లే అవకాశం ఉందా..? అంత అవసరం లేదు..! ఆయనను టీఆర్ఎస్ పార్టీ కావాలని టార్గెట్ చేసి పంపించేసింది కదా.. ! ఆయనపై భూకబ్జాదారుడు అని ముద్ర వేసింది కదా.. ! అటువంటి ఈటెల రాజేందర్ ను కేసిఆర్ వెనక్కు తీసుకుంటారా..? అంత అవమాన భారంతో బయటకు వెళ్లిపోయిన ఈటెల రాజేందర్ మళ్లీ టీఆర్ఎస్ లోకి వస్తారా..? ఇన్ని సందేహాలు.. ఇవన్నీ గాలి కబుర్లే.. ఆయన వెనక్కు రారు అని చాలా మంది అనుకుంటున్నారు.
కేసిఆర్ ‘ఘర్ వాపసీ’ నినాదం
అయితే ఆయా పార్టీలను విచారిస్తే .. ఈటల రాజేందర్ వెనక్కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు అన్న మాట కూడా వినబడుతోంది. ఈటెల రాజేందర్ మళ్లీ టీఆర్ఎస్ వైపుకు వెళ్తారు అని జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా కొట్టి పారేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే .. ? తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో అన్న చిన్న పాటి ఆందోళన ఉంది. దీనికి తగ్గట్టుగా డక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక.. ఈటెల రాజేందర్ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు. మళ్లీ గులాబీ పార్టీకి వెళ్లడానికి రెడీగా ఉన్నారంటూ కథనాన్ని ఇచ్చింది. కేసిఆర్ ‘ఘర్ వాపసీ’ పేరుతో టీఆర్ఎస్ నుండి వెళ్లిన వారిని మళ్లీ పిలుస్తున్నారు అంటూ కథనం పేర్కొంది. ఇందు కోసం కేసిఆర్ ఒక బ్లూప్రింట్ రెడీ చేశారనీ, తిరిగి వచ్చిన వాళ్లకు పార్టీలో, ప్రభుత్వంలో గతంలో కంటే మంచి ప్రాధాన్యత ఇవ్వడానికి కేసిఆర్ రెడీ అవుతున్నారని పేర్కొంది.
ఈ అవకాశాలు ఉన్నాయా..? లేదా అంటే.. టీఆర్ఎస్ కు కొన్ని అవసరాలు ఉన్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ రిస్క్ లో ఉంది. బీజేపీ లాంటి పార్టీతో తలపడుతోంది. ఈ పరిస్థితుల్లో బలమైన నాయకుల అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈటెల రాజేందర్ లాంటి నాయకులు టీఆర్ఎస్ కు అవసరం ఉంది కాబట్టి వెనక్కు పిలుస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు, ఆశ్చర్యకరం లేదు. ఈటెల రాజేందర్ బీజేపీలోకి అయితే వెళ్లారు కానీ మునుపడి హోదా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అధికారంలోకి రాకపోతే మంత్రిపదవి లేకుండా ఒక ఎమ్మెల్యేగానే కొనసాగాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే టీఆర్ఎస్ ఆయనకు ఆఫర్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. తెలంగాణలో మేము బలపడ్డాము అని చెప్పుకుంటున్న బీజేపీకి షాక్ ఇవ్వడానికి కేసిఆర్ సిద్దం అవుతున్నారు అనేది ఆ కథనంలోని సారాంశం. అయితే బీజేపీ చాలా అప్రమత్తంగా ఉంది. వీళ్లకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది. వ్యవస్థల సహకారం ఉంది.
ఆత్మరక్షణలో బీజేపీ
తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కసిగా బీజేపీ ఉంది. వీళ్లకు ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. టీఆర్ఎస్ లోని 12 నుండి 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ మారడానికి రెడిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ ప్లాన్ ను పసిగట్టింది కాబట్టే బీజేపీ మీద టీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాన్ని భగ్నం చేయడంతో పాటు సమాజంలో బీజేపీని దోషిగా చూపించింది. ఒక వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీలో చేరితే తాము ముందే చెప్పాము, బీజేపీ కొనేసింది అని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం బీజేపీ ఆత్మరక్షణలో పడింది. ఎన్నికలకు ముందు అయితే పార్టీ మార్పులు చాలా సాధారణంగా జరిగిపోతుంటాయి. ఎన్నికలకు ముందు చాలా మంది టీఆర్ఎస్ నేతలను చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహం వేస్తుంటే..బయటకు వెళ్లిన వాళ్లందరినీ వెనక్కు రప్పించడానికి కేసిఆర్ కూడా వ్యూహం వేస్తున్నారు. ఇలా తెలంగాణలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం తనపై జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఈటెల రాజేందర్ కొట్టిపారేస్తున్నారు. రాబోయే ఎన్నికల సమయానికి ఎవరి వ్యూహాలు సక్సెస్ అవుతాయో వేచి చూద్దాం..!
శ్రీకాకుళం: వైసీపి కొత్త ప్రయోగాలు..! స్పీకర్, ధర్మాన మళ్లీ డౌటేనా..!?