Proddatur (Kadapa): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలైన దోషులకు శిక్ష పడాలని ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం, ఎంపి అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తే సునీతా రెడ్డి సుప్రీం కోర్టు ను ఆశ్రయించగా .. విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. మరో పక్క సునీత రెడ్డి టీడీపీ నేతలతో కుమ్మక్కు అయ్యారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తొంది. ఈ క్రమంలోనే కడప జిల్లా ప్రొద్దుటూరులో సునీతారెడ్డి పోస్టర్ లు కలకలం రేపాయి.
సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం అంటూ ఆ పోస్టర్ లో ఉంది. రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న డాక్టర్ సునీతా రెడ్డి గారికి స్వాగతం .. సుస్వాగతం అంటూ వేసిన పోస్టర్ లో ఉంది. వివేకా, చంద్రబాబు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఇతర టీడీపీ నేతల ఫోటోలతో జై తెలుగుదేశం అంటూ పచ్చ పోస్టర్ లు గోడలపై కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్ లను అంటించినట్లు తెలుస్తొంది. వివేక హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రొద్దుటూరు లో ఈ పోస్టర్ లు గోడలకు కనిపించడం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.