PM Modi Visit Train Accident Site: ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రధాని మోడీకి ప్రాధమిక వివరాలు తెలియజేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ప్రశ్నించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ప్రధాని మోడీ.
అనంతరం ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదానికి కారణమైన వారిని క్షమించబోమని అన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైలు ప్రమాదంలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదం తనను కలచివేసిందని భావోద్వేగానికి గురైయ్యారు మోడీ.