హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టిఆర్ఎస్ సర్కార్ వైఖరిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నేడు అర్థనగ్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలంగాణ సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆపాలని నారాయణ డిమాండ్ చేశారు.
వేలాది మంది ఓటర్లు నమ్మి అసెంబ్లీకి పంపితే సిగ్గు విడిచి పార్టీలు మారుతున్నారనీ నారాయణ దుయ్యబట్టారు. జనాలను మోసం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను అమ్మడానికి కూడా వెనుకాడరని నారాయణ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వాళ్లు సిగ్గుపడాలన్నారు.
వయస్సులో చిన్నవాడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని చూసి ఇక్కడి సిఎం కెసిఆర్ నేర్చుకోవాలని నారాయణ హితవు పలికారు. జగన్ కాళ్ల కింద వంద సార్లు దూరినా కెసిఆర్కు బుద్దిరాదని నారాయణ ఘాటుగా విమర్శించారు. అమిత్షా, మోది, కెసిఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా తయారు అవుతారని నారాయణ హెచ్చరించారు. టిఆర్ఎస్కు ఎంఐఎం వంటింటి కుందేలు అని నారాయణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. సిపిఐ నేతల నిరసనను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకొని నారాయణతో సహా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.