దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 50 మంది ప్రయాణీకులు, 11 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరంతా పాపికొండల విహార యాత్రకు బయలుదేరినట్లు తెలుస్తోంది. బోటులో ప్రయాణిస్తున్నవారిలో కొంత మంది లైఫ్ జాకెట్లు ధరించారని సమాచారం. వరదలో కొట్టుకుపోతున్న పలువురు ప్రయాణీకులను కాపాడి ఒడ్డుకు చేర్చారు. 37మంది వరకూ క్షేమంగా ఒడ్డుకు చేరారని సమాచారం. గల్లంతు అయిన మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నిన్నటి వరకూ గోదావరిలో అయిదు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. వరద తగ్గుముఖం పట్టడంతో బోట్ల పర్యాటకానికి అధికారులు అనుమతిచ్చారు. గండిపోచమ్మ ఆలయం నుండి బోటు బయలుదేరినట్లు చెబుతున్నారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ అధికారుల పర్యవేక్షణలో గాలింపు చర్యలు నిర్వహించారు.
లాంచి ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించారు. మంత్రులను అప్రమత్తం చేసి ఘనటా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, తూర్పు గోదావరి జిల్లా అధికారులతో సిఎం మాట్లాడారు. అధికార యంత్రాంగం రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను గాలింపు చర్యలకు పంపింది. మంత్రులు అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, కె కన్నబాబు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. రాయల్ వశిష్ట లాంచి ప్రమాదానికి గురైనట్లు అధికారులు గుర్తించారు.