(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 20 అసెంబ్లీ స్థానాల్లో శనివారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 260 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 18 అసెంబ్లీ స్థానాలకు మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరో రెండు స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 47 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్దాస్ జంషెడ్పూర్ ఈస్ట్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. అలాగే, స్పీకర్ దినేశ్ ఓరాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు.