ఉన్నావ్ బాధితురాలిపై గురువారం పెట్రోల్ పోసి నిప్పంటించింది ఇక్కడే
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: ‘నేను బతకాలి. నన్ను బతికించండి ప్లీజ్’ ఇదీ ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు తనకు వైద్యం చేస్తున్న డాక్టర్లను వేడుకున్న తీరు. తన జీవితాన్ని సర్వనాశనం చేసిన రేపిస్టులకు శిక్ష పడితే చూడాలన్నది ఆ యువతి ఆరాటం. చివరికి ఆ కోరిక తీరకుండానే ఆమె కన్నుమూసింది. తాత్కాలికంగానయినా రేపిస్టులదే పైచేయి అయింది.
బెయిల్పై విడుదలయిన రేపిస్టులు గత గురువారం ఉన్నావ్ బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరో ముగ్గురు ఈ ఘోరంలో పాలు పంచుకున్నారు. 90 శాతం కాలిన గాయాలతో కొనఊపిరితో ఉన్న యువతిని మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ, సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి కన్నుమూసింది.
గురువారం రాత్రి బాధితురాలిని తీసుకువచ్చినపుడు ఆమె తెలివిలోనే ఉందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ గుప్తా చెప్పారు. తనపై అత్యాచారం చేసిన వారు తప్పించుకోకూడదనీ, తాను బతకాలని అమె తపన పడిందనీ గుప్తా పేర్కొన్నారు. శాయశక్తులా ప్రయత్నించీ ఆమె ప్రాణాలు కాపాడలేకపోయామని ఆయన అన్నారు.