లక్నో: డ్యాన్స్ చేయడం ఆపేసిందని ఓ యువతి ముఖంపై తుపాకీతో కాల్చాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని చిత్రాకూట్ లో జరిగింది. డిసెంబర్ 1న చిత్రకూట్ లో సుధీర్ సింగ్ పటేల్ అనే వ్యక్తి కుమార్తె పెళ్లి వేడుకలో కళాకారులతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు యువతులు డ్యాన్స్ చేశారు. అయితే, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని స్టేజ్ పైకి వెళ్లాడు. అయితే, అతడిని చూడగానే ఇద్దరు యువతులు నృత్యం చేయడం ఆపేశారు. దీంతో ఆ వ్యక్తి.. ‘డ్యాన్స్ ఎందుకు ఆపారు ? చేయండి.. లేదంటే కాల్చేస్తా’ అంటూ తన వద్ద ఉన్న తపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. బులెట్ ముఖంపై తగలగానే ఆ యువతి ఒక్కసారిగా వేదికపైనే కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు యువతి ప్రస్తుతం కాన్పూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ కాల్పుల్లో వేదికపై ఉన్న వరుడి మావయ్యలు మిథిలేష్, అఖిలేష్ కూడా గాయపడ్డారు. ఈ ఘటన సమయంలో గ్రామ పెద్ద కూడా అక్కడే ఉన్నారు. ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తే యువతిపై కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.