ప్రధానిగా మోడీ అన్నివిధాలా విఫలమైనందున దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ కూటమిలోకి అన్ని పార్టీలను తానే తీసుకువస్తాననీ ప్రకటించిన టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు ఇప్పటికీ అదే లక్ష్యంతో ఉన్నారా?…లేక ఆయన నిర్ణయంలో ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయమై తాజాగా మీడియాలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. దీంతో చంద్రబాబు మరోసారి యూటర్న్ తీసుకున్నారా?…అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో తాజాగా వెలువడుతున్న కథనాలే దీనికి కారణమని తెలుస్తోంది. తాము కొందరు ఎపి టిడిపి నేతలను కలసి కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా?…అని ప్రశ్నించగా ఉండదనే ఎక్కువ మంది చెబుతున్నారని, ఎపిలో ఉండదా?…లేక మొత్తంగా జాతీయ స్థాయిలో కూడా ఉండదా?…అనే ప్రశ్నలకు కొంతమంది ఎపిలో ఉండదని చెప్పగా మరికొందరు జాతీయ స్థాయిలో కూడా ఉండదని చెప్పడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆ సంస్థలు తమ కథనాల్లో పేర్కొంటున్నాయి. దీంతో కాంగ్రెస్ తో కూటమి విషయంలో కూడా చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నట్లుగా ఆ సంస్థలు వార్తలు వండి వారుస్తున్నాయి. అయితే ఆ విషయాన్ని నేరుగా కాకుండా ప్రశ్నార్థకాలతో, ఆశ్చర్యార్థకాలతో ప్రచురిస్తున్నాయి.
చంద్రబాబు ఈ విషయమై నిజంగానే యూ టర్న్ తీసుకుంటే అందుకు ప్రధానంగా మూడు అంశాలు కారణం కావచ్చని వారు విశ్లేషిస్తున్నారు. అవి: 1. తెలంగాణా ఎన్నికల ఫలితాలు. 2.ఆంధ్రాలో కాంగ్రెస్ పై కొనసాగుతున్న వ్యతిరేకత. 3.జాతీయ స్థాయిలో బిజెపి,కాంగ్రెస్ లకు అనుకూల,వ్యతిరేక పరిస్థితులు.
ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఇటీవల ప్రాంతీయ పార్టీల పరంగా చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు చంద్రబాబును కాంగ్రెస్ కూటమిని కూడగట్టే విషయమై పునరాలోచనలో పడేలా చేసుండొచ్చనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
కారణాలు ఏమైనప్పటికి తెలంగాణాలో కాంగ్రెస్ తో కలసి ఏర్పాటు చేసిన మహా కూటమి దారుణంగా దెబ్బతినడమనేది చంద్రబాబును ఖంగు తినిపించడం, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ఎపి ప్రజల్లో ఇంకా ఆ పార్టీ పట్ల చల్లారని వ్యతిరేకత, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వం విషయానికొస్తే ప్రధాని పదవికి రాహుల్ ని ప్రతిపాదించడం ఆ పార్టీకి అనివార్యమని అందరూ భావించడం, అలాగే బిజెపికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నా అది పూర్తి స్థాయిలో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా నిరోధించే స్థాయిలో ఉందని నమ్మకం కలగకపోవడం…పైగా కాంగ్రెస్ తో వస్తారనుకున్న ఎస్పి,బిఎస్పి నేతలు అఖిలేష్, మాయావతి ఇద్దరూ కలసి వేరే కుంపటి పెట్టుకోవడం…
ఈ కారణాలు చంద్రబాబు కాంగ్రెస్ తో కూటమి ఏర్పాటుకు వెనుకంజ వేసే పరిస్థితి కల్పించి ఉండొచ్చని…ఈ విషయాలు పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చి ఉండొచ్చని…అందుకే ఆ పార్టీ నేతలు ఇలా కాంగ్రెస్ తో పొత్తు ఉండదని చెబుతున్నారని జాతీయ మీడియా సంస్థలు విశ్లేషణలు చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు కాంగ్రెస్ కూటమి కూడ గట్టే విషయమై మరో యూ టర్న్ తీసుకోవటం ఖాయమనే తీరులో వార్తలు వండివారుస్తున్నాయి. అయితే బిజెపి ప్రోద్భలంతోనే ఈ విధమైన కథనాలు వెలువడుతున్నాయని కొట్టివేసేవారూ లేకపోలేదు.