అమరావతి : కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా మూతపడిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తెరుచుకోనున్నది. తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. భక్తుల శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్వర్వులు జారీచేశారు.
లాక్డౌన్ నిబంధనలను అనుసరిస్తూ శ్రీవారి దర్శనాన్ని కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుండి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేసిన విషయం విదితమే.