ABN vs BJP : నాలుగో పేజీ నుంచి మొదటి పేజీకి తానంతట తానే ప్రమోషన్ ఇచ్చుకున్న ఏబీఎన్ రాధాకృష్ణ కుట్ర పలుకుల్లో ఈ వారం భారతీయ జనతా పార్టీ ప్రధాన అంశం అయ్యింది. వారానికో పార్టీ మీద, వ్యక్తుల మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాసి అబద్ధాల అక్షరమాల లు వేసుకొని ఆనందపడే రాధాకృష్ణ ఈవారం కులం ప్రస్తావననూ తీసుకొచ్చి, తాను ఓ కులానికి చెందినవాడుగా చెప్పుకుంటూనే దీనివల్లే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తన మీద అక్కసు వెల్లగక్కుతున్నారు అంటూ కుల కోణాలు బయటకు తీయడం కొత్త విషయం.
క్షమాపణ చెబితే తప్పా!
బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మీద ఇటీవల అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు శ్రీనివాస్ ఏబీఎన్ చర్చా వేదికలో లైవ్ డిబేట్ లో చెప్పు విసరడం వివాదాస్పదమైంది. దీనిపై ఇప్పటికే బీజేపీ పోలీస్ కేసు సైతం నమోదు చేసింది. ఈ విషయంలో యాజమాన్యం కావాలనే బీజేపీ పరువు బజారు కీడ్చాలానే ఉద్దేశంతోనే, తమ నేత మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేయించారు అనేది బీజేపీ నమ్ముతోంది. ఈ భావన తోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని, అప్పటివరకు ఆ ఛానల్ను బిజెపి రాష్ట్ర శాఖ బహిష్కరిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన విడుదల చేశారు. ఒక ఛానెల్లో చర్చ ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి మీద చెప్పు తో దాడి జరగడం పెద్ద విషయమే. దీనిపై అతిథుల్ని పిలిచి, ఆరోగ్యకరమైన చర్చ నిర్వహించాల్సిన ఛానల్ యాజమాన్యం ఆ బాధ్యత నుంచి తప్పు కోవాలి అనుకోవడం తప్పు. అనుకోకుండా జరిగిన దాడిగా భావించి ఛానల్ బేషరతుగా క్షమాపణ చెప్పడం లో తప్పు ఏముంది. దీనికి ఒక పెద్ద వ్యాసం రాసి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏబీఎన్ రాధాకృష్ణకు ఏముంది..?
** ఈ అంశం మీదనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ ఆదివారం కుట్ర పలుకులు పలికారు. మరోసారి బిజెపి మీద తన అక్కసు వెళ్లగక్కుతూనే, తనకు తన మిత్రుడు చంద్రబాబుకు నచ్చని ఒక నలుగురు జగన్ సేవలో తరిస్తున్నారు అంటూ పేర్లతో సహా రాశారు. పార్టీ ప్రయోజనాలు గాలికి వదిలేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడమే లక్ష్యంగా బీజేపీ నాయకులు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్ పని చేస్తున్నారంటూ రాయడమే కాదు.. బిజెపి నాయకులే ఈ మాట చెబుతున్నారు అంటూ ఆ పార్టీలోనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు.
కులం ప్రస్తావన ఎలా?
ఒక పత్రిక అధిపతిగా, జర్నలిస్టుగా కులాలను మతాలను చూడకుండా పని చేయాల్సిన బాధ్యత ఉన్న రాధాకృష్ణ ఆ విషయాన్ని మర్చిపోయారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాను ఇప్పటివరకు ఒక్క సారి కూడా కలవలేదని, అయినా సోము వీర్రాజు తన మీద ద్వేషంతో రగిలిపోతున్నారు అంటూ చెప్పుకుంటూనే దానికి కుల ద్వేషం అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఇప్పటివరకు బహిరంగంగా ఆంధ్రజ్యోతి మీద కానీ రాధాకృష్ణ మీద గాని సోము వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు చేసింది లేదు. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ కుల పలుకులు ఎలా పలుకుతారు. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో కమ్మ, కాపు మధ్య ఉన్న అంతరాన్ని మరోసారి రాధాకృష్ణ తెరమీదికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారా?? ఈ రకంగా ఏమైనా రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి తన బాస్ కనుసన్నల్లో కొత్త స్కెచ్ వేశారా అన్న అనుమానం కలుగుతోంది. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పత్రికాధిపతి మీద కుల ద్వేషం చూపించాల్సిన అవసరం ఏముందో రాధాకృష్ణ కే తెలియాలి.
జనసేన కు బీజేపీ కీ మధ్య చిచ్చు!
రాధాకృష్ణ తన పలుకుల్లో బీజేపీ జనసేన పొత్తు చెడిపోతుంది అనేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవకాశం కోసం పవన్ కళ్యాణ్ వేచి చూస్తున్నారని, బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని జనసేన పార్టీ నాయకులు సైతం ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లు రాధాకృష్ణ తన వ్యాసం లో రాసుకొచ్చారు. ఎవరి మీదైనా సులువుగా వ్యాఖ్యానాలు విమర్శలు చేసే అలవాటు ఉన్న రాధాకృష్ణ ఈ విషయంలో ఆ రెండు పార్టీల పొత్తు చెడిపోతుంది అనడానికి సరైన కారణాలను పేర్కొనలేదు. అందులోనూ రెండు పార్టీలకు సంబంధించిన విషయంలో రాధాకృష్ణ వ్యాఖ్యలు చేయడం ఏమిటో ఆయన జర్నలిజం నైతిక ఏమిటో ఆయనకే తెలియాలి. వారం వారం తన మీద నూతన మిత్రులు చంద్రబాబు మీద నాకు ఏదో ఒక అంశం పట్టుకొని, దానికి మసి పూసి మారేడు కాయ చేసి, తన అక్కసు, ఆగ్రహం అంతా చూపిస్తూ రాసుకునే ఏబీఎన్ రాధాకృష్ణ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రిక మొత్తాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.