Agrigold : అగ్రిగోల్డ్ డైరెక్టర్లలో ఒకరైన అవ్వా ఉదయ్ భాస్కర్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఉదయ్ భాస్కర్ గురువారం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
అగ్నిగోల్డ్ స్కామ్ కేసులో గతంలో ఆయన సోదరుడు చైర్మన్ అవ్వా వెంకట రామారావుతో సహా డైరెక్టర్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ తదితరులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కొద్ది నెలలు జైలులో ఉన్న అనంతరం వీరు బెయిల్ పై బయటకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. లక్షలాది మంది ఖాతాదారులను మోసం చేసి వసూలు చేసిన కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించారన్న అభియోగాలు వారిపై ఉన్నాయి. ఏపి, తెలంగాణలోనూ అగ్రిగోల్డ్ సంస్థపై కేసులు నడుస్తున్నాయి. లక్షలాది మంది ఖాతాదారులకు న్యాయం చేసేందుకు గానూ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.