CBI Case : వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు నమోదు చేసింది. గతంలోనూ బ్యాంకు లోన్లకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఎస్బీఐ చెన్నై బ్రాంచ్ డిప్యూటి జనరల్ మేనేజర్ రవిచంద్ర ఫిర్యాదు పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇంద్ భారత్ ప్రాజెక్టు కోసం రఘురామకృష్ణం రాజు రూ. 273.84 కోట్ల రుణం తీసుకుని ఎగవేశారనీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేశారనీ, తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారనీ ఫిర్యాదులో మేనేజర్ రవిచంద్ర పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన సీబీఐకి ఫిర్యాదు చేయగా వారు విచారణ జరిపి రఘురామ కృష్ణంరాజుతో పాటు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మదుసూధనరెడ్డి, నారాయణ ప్రసాద్, భాగవతుల రామచంద్ర అయ్యర్ తదితరులపై కేసు నమోదు చేసింది.
గత కొద్ది నెలలుగా రఘురామకృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా నిత్యం ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రఘురామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన నియోజకవర్గ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించగా అరెస్టు నుండి మినహాయింపు ఉత్తర్వులను కోర్టు ఇచ్చింది. దాదాపు ఏడాది కాలంగా రఘురామ కృష్ణం రాజు ఢిల్లీలోనే ఉంటున్నారు. తన నియోజకవర్గం నరసాపురం రాలేదు. తాను తన నియోజకవర్గంలోకి వెళ్లలేని పరిస్థితి ఉందంటూ లోక్సభలోనే తన ఆవేదనను వ్యక్తం చేశారు రఘురామ కృష్ణం రాజు. అయితే ఇప్పుడు మరో మారు సీబీఐ రఘురామ కృష్ణం రాజు పై కేసు నమోదు చేయడంతో సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.