AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పదవ రోజైన మంగళవారం ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయిన వెంటనే టీడీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సభ్యుల ప్రశ్నకు మంత్రి బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు గొడవ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ నలుగురు టీడీపీ సభ్యులపై ఈ నెల 25వ తేదీ వరకూ సస్పెన్షన్ వేటు వేశారు. టీడీపీ సభ్యులు బి అశోక్, రామరాజు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణ బాబులను సస్పెండ్ చేశారు.
AP Assembly Budget Session: ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సీఐడీ విచారణ జరుగుతోంది
ఫైబర్ గ్రిడ్ టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని, నిబంధనలు పాటించకుండా నాటి టీడీపీ ప్రభుత్వం టెర్రాస్ కంపెనీకి ఫైబర్ గ్రిడ్ అప్పగించారని వైసీపీ సభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మంత్రి చెప్పాల్సిన సమాధానాన్ని కూడా సభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ తన ప్రసంగంలో చెప్పడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ సమాధానంలో మంత్రి ఇవన్నీ చెబుతారు అంటూ వారించారు. టెరాసాఫ్ట్ కంపెనీ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడికి చెందినదని, బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీకి టెండర్లు ఇచ్చారని మంత్రి బాలినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఫైబర్ గ్రిడ్ లో జరిగిన లోపాలను వివరించిన మంత్రి బాలినేని.. దీనిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిందన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందని, దీనిలో ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని కశ్చితంగా వారికి శిక్ష పడుతుందని మంత్రి బాలినేని పేర్కొన్నారు.