CM YS Jagan: తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రికార్డు సమయంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవర్ను సోమవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని మామిడికాయల మండీ వద్ద జరిగిన శ్రీనివాస సేతు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ రూ.650.50 కోట్లతో 7 కిలో మీటర్ల మేర నిర్మించిన ఫ్లై ఓవర్ తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఆభరణం లాంటిదన్నారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతమని, దీని వల్ల ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, యాత్రికులు సులభంగా తిరుమలకు చేరుకోగలగుతారని అన్నారు.
హాస్టల్ బ్లాక్ల ప్రారంభం
తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 37.80 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. హాస్టల్ బ్లాకుల్లో మొత్తం 181 గదులు ఉన్నాయి. ఇందులో 750 మంది విద్యార్థులు బస చేసే అవకాశం ఉంది.
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్ ఇంటి స్థలాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం టీటీడీ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమన్నారు. మొత్తం 6700 మంది టీటీడీ ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం రూ.313 కోట్ల వ్యయంతో 3,518 మందికి ఇంటిస్థల పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.280 కోట్ల వ్యయంతో మిగిలిన ఉద్యోగులకు కూడా 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గతంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు మంజూరయ్యాయని, తిరిగి వారి కుమారుడు సీఎం జగన్ హయాంలోనే ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. తండ్రీ కొడుకుల హయాంలోనే టీటీడీ బోర్డు ఛైర్మన్గా పని చేయడం తన అదృష్టమన్నారు. టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారం చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ సీఎం జగన్ తిరుమలకు బయలుదేరే ముందు తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల శ్రీవారు సంప్రదాయంగా సారె పంపుతారు. స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి కృషితో ముఖ్యమంత్రి తిరుమల చేరుకునే ముందు గంగమ్మను దర్శించుకునే సంప్రదాయం చాలా దశాబ్దాల తరువాత గత ఏడాది నుండి పునఃప్రారంభమైంది.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం సురేష్, ఆర్కే రోజా, తుడా ఛైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, టీటీడీ జేఈవోలు సదా భార్గవి తదితరులు పాల్గొన్నారు.