AP CM YS Jagan: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్ల ఆమోదంతో పాటు రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, గ్రూపు ఒన్ వివాదం తదితర కీలక అంశాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించినట్లు సమాచారం.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికకు గానూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నలుగురు నేతల పేర్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్ రాజు, రమేష్ యాదవ్ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే వీరిలో తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్ లపై గతంలో పలు కేసులు ఉన్న విషయాన్ని తెలియజేస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాసి అభ్యంతరాలు తెలియజేశారు. దీంతో గవర్నర్ ఆ పేర్ల ఆమోదానికి అభ్యంతరం తెలియజేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గవర్నర్ ను సీఎం జగన్ కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా త్వరలో 80 కార్పోరేషన్లు, 960 డైరెక్టర్ ల పదవుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వాటిపైనా చర్చించినట్లు సమాచారం. పలు విషయాలకు సంబంధించి సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ నుండి సూచనలు, సలహాలు తీసుకున్నారు.