AP CM YS Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ రెండేళ్లలో ప్రజలకు వివిధ రూపాల్లో చేసిన ఖర్చులను జగన్ తెలియజేశారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి తనదైన మార్క్ చూపుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలపై ప్రత్యేక దృష్టి సారించారు. సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా జగన్ పరిపాలన చేసి చూపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అప్పులు తెచ్చి మరీ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
“దేవుని దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాo. ప్రజలకు నేరుగా రూ. 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ. 36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందించగలిగాం” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
“ ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరిచ్చిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను” అని జగన్ పేర్కొన్నారు.
రెండేళ్ల పాలన పూర్తి అయిన నేపథ్యంలో ఆదివారం వైఎస్ జగన్ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో పని చేస్తున్న సిబ్బందికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగానని జగన్ పేర్కొన్నారు.