CM YS Jagan: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏ పరిధిలో 50వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. సీఆర్డీఏ పరిధిలో 1402 ఎకరాలు, 25 లే అవుట్ లలో 50,793 మంది పేదలకు ఈ ఏడాది మే 26న ఏపీ సర్కార్ ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, ఇవేళ అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం గ్రామం వద్ద ఇళ్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ భూమిపూజ కార్యక్రమం నిర్వహించి పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం వెంకటపాలెం వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టుల్లో పిటీషన్లు వేశారని దుయ్యబట్టారు. అయినప్పటికీ మంచి సంకల్పంతో పేదల సొంతింటి కల సాకారం అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇకపై ఇది సామాజిక అమరావతిగా ఆయన పేర్కొన్నారు.
నిజంగా ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా ఎప్పటికీ నిలిచిపోయే రోజు అవుతుందన్నారు. పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎనెన్నో అవరోధాలు అధిగమించి ఈ రోజు కార్యక్రమం పేదల విజయంతో జరుగుతోందన్నారు. ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డు తగిలిన ప్రబుధ్దులు ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఒక దత్తపుత్రుడు, ఇతరత్రా చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు వీరంతా చివరి వరకూ ఒక పేద వాడికి ఒక ఇళ్లు రాకూడదు, ఇంటి స్థలం రాకూడదని అడ్డుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఈ రోజుటికీ కూడా ఈ దుర్మార్గులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. వీళ్లంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఆ తర్వాత పేదలకు ఇళ్లు కట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారన్నారు. ఏకంగా హైకోర్టుకు వెళ్లారు, ఇళ్లు రాకుండా సుప్రీం కోర్టు ద్వారా వెళ్లిన పరిస్థితులు చూశామనీ, ఇంత దౌర్బగ్య పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు.
ఈ గజ దొంగల ముఠా పేదలకు వ్యతిరేకంగా హైకోర్టులో 18, సుప్రీం కోర్టులో అయిదు కేసులు వేశారన్నారు. మూడేళ్ల పాటు వీళ్లు చేసిన కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ వీళ్లందరితో పోరాటం చేస్తూ వచ్చాడన్నారు. చివరికి దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని ఆశీస్సులు మంచికే ఉంటాయి కాబట్టి హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడూ రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకుని ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ తర్వాత కూడా వీరి బుద్ది మారలేదనీ, ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి ఇళ్లు నిర్మాణం కూడా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో వీరు ఎక్కని గడప లేదు, దిగని గడప లేదు, కలవని కేంద్ర సెక్రటరీ కూడా లేడని అన్నారు. ఇంత మందిని కలిసి చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారన్నారు. దేవుడి దయతో అన్నింటినీ అధిగమించి అడుగులు ముందుకు వేశామన్నారు జగన్. ప్రతి విషంలోనూ కాడా మన పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య యుద్దం జరుగుతోందని అన్నారు. ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఇక్కడ నుండి పునాది రాయి వేస్తున్నాననీ, ఇక నుంచి ఈ అమరావతి మనందరి అమరావతి కాబోతోందని సీఎం జగన్ ప్రకటించారు.
అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్