AP High Court: ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి భారీ ఊరట లభించింది. పది సంవత్సరాలకు పైబడి శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాధమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. అయితే సీఐడీ అధికారులు సీఆర్పీసీలోని 41 ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ జరుపుకోవచ్చని తెలిపింది. అయ్యన్న పాత్రుడు, ఆయన ఇద్దరు కుమారులపై ఏపీ సీఐడీ అధికారులు ఐపీసీ 464, 467, 471, 474, సెక్షన్ల కిందకేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇటీవల ఆయన్ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి విశాఖ కోర్టులో హజరుపర్చారు. అయితే ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఐపీసీ 467 చెల్లదని పేర్కొన్న న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టు తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు.
ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడుపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వీవీ సతీష్ హైకోర్టును ఆశ్రయించారు. తన క్లయింట్ పై ఉద్దేశపూర్వకంగా సెక్షన్ 467 నమోదు చేశారనీ, ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని అయ్యన్న తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. మరో వైపు సీఐడీ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారనీ, తదుపరి ఫోర్జరీ ఎన్ఓసీ పత్రాలు సృష్టించారనీ, దీనిపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను బెదిరించడం, భయపెట్టడం వంటివి చేశారని అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని వివరించారు. గత వారం ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఇవేళ అయ్యన్న కేసులో సెక్షన్ 467 వర్తించదని కోర్టు తెలిపింది.
Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట