AP School Holidays: దేశంలో కరోనా మహమ్మారి మరో సారి పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రామ్ వ్యాప్తితో థర్డ్ వేవ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. ఏపిలో 24 గంటల వ్యవధిలో దాదాపు 15వేలు కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించాయి. అయితే ఏపిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పెద్దగా ప్రమాదం లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల ప్రకటించారు.
AP School Holidays: పాఠశాలల్లో కరోనా కలకలం
దీంతో సంక్రాంతి సెలవులు ముగిసిన తరువాత సోమవారం నుండి యధా విధిగా పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కరోనా కలకలం మొదలయ్యంది. పలు పాఠశాలల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం ప్రజలు సాధారణ జలుబు, జ్వరం వచ్చినా కరోనాగా భయపడుతున్నారు. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నా కానీ ప్రస్తుతానికి ప్రమాదం లేదనీ, వైరస్ నిర్ధారణ అయిన వారం రోజులకే నెగటివ్ వచ్చేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు.
పేరెంట్స్ లో ఆందోళన
పాఠశాల విద్యార్ధులు కరోనా బారిన పడుతుండటంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలన్న డిమాండ్ వస్తుంది. అయితే ఏ పాఠశాలల్లో అయితే విద్యార్ధులు కరోనా బారిన పడుతున్నారో ఆ పాఠశాల వరకే మూసివేస్తామని ఇటీవల మంత్రి సురేష్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.