Black Fungus: తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలను బ్లాక్ ఫంగస్ భయం వెంటాడుతుంది. గతంలో వీటికి సంబంధించి ఏడాది కాలంలో నమోదయ్యే కేసులు ఇటీవల కేవలం 10 రోజుల వ్యవధిలో వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్న సమయంలో ఈ పరిణామం షాకింగ్ గా మారింది.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
వీళ్లలోనే బ్లాక్ ఫంగస్…
స్టెరాయిడ్స్ అధికంగా ఉపయోగించి కోలుకున్న కరోనా రోగులతో పాటు మధుమేహం నియంత్రణ లో లేకపోవటం కూడా బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కరోనా విషయంలో 100 మందిలో 85 మందికి ఏ చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటుండగా మరో 10 శాతం మందికి పైగా నామమాత్రపు చికిత్స సరిపోతుంది. ఇక మిగిలిన మూడు నుంచి నాలుగు శాతం మందికి సీరియస్ రోగులకు సకాలంలో వైద్యచికిత్సలందించి ప్రాణాలు కాపాడాల్సి ఉంటుంది. అయితే బ్లాక్ ఫంగస్ విషయం అలా కాదు. ఇది ఒకసారి వచ్చిందంటే దీని బారిన పడ్డ వారందరికి చికిత్స చేయాల్సిందే. ఐసోలేషన్, క్వారంటైన్ లాంటివి పని చేయవు. డాక్టర్ల పర్యవేక్షణ, శస్త్రచికిత్స తప్పనిసరి. ఆలస్యమైతే అంధత్వం కూడా వచ్చే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Read More: Corona: షాక్ః పక్క రాష్ట్రంలో కొత్త రకం కరోనా కేసు
తెలంగాణలో భారీగా కేసులు
బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజూకు పెరిగిపోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా 1,500 పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,150 బెడ్లు ఉండటం గమనార్హం. ఇందులోనూ బ్లాక్ ఫంగస్ కు నోడల్ ఆస్పత్రిగా ఏర్పాటు చేసిన ఈఎన్ టీ (చెవి, ముక్కు, గొంతు) ఆస్పత్రిలో ముందుగా 285 బెడ్లను ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సామర్థ్యం 200 బెడ్లే ఉన్నప్పటికీ ఒక్కసారిగా పెరిగిన రోగుల తాకిడితో అదనంగా 85 పడకలను ఏర్పాటు చేశారు. దీనికి తోడు గాంధీ ఆస్పత్రిలో మరో 200 మంది వరకూ రోగులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండటంతో ఈఎన్ టీ, గాంధీ ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు జిల్లా ఆస్పత్రుల్లోనూ చికిత్సను ప్రారంభించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది.