Brahmamgari Matam: ఎట్టకేలకు బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. గత కొద్ది రోజులుగా దివంగత మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వారసత్వ కుటుంబాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అనేక పర్యాయాలు చర్చలు జరిపినా వ్యవహారం ఫైనల్ కాలేదు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ ను నియమించడంతో ఆయన శనివారం మఠానికి చేరుకుని వారసత్వ కుటుంబ సభ్యులతో వేరువేరుగా చర్చలు జరిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా ఈ వివాద పరిష్కారానికి తన వంతు ప్రయత్నాలను చేశారు.
Read More: Revanth Reddy: బిగ్ బ్రేకింగ్..టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన ఏఐసీసీ
మఠం పీఠాధిపతి విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. నూతన పీఠాధిపతిగా దివంగత మఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి నియమితులైయ్యారు. ఈ విషయాన్ని ప్రత్యేక అధికారి చంద్రశేఖర ఆజాద్ మీడియాకు వెల్లడించారు. పీఠాధిపతి పదవి కోసం పోటీ పడిన ఇరు కుటుంబాలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి, మఠం ఉత్తరాదికారిగా ఆయన సోదరుడు వీరభద్రయ్య బాధ్యతలు చేపడతారని చంద్రశేఖర ఆజాద్ వెల్లడించారు. కాగా తదుపరి మఠాధిపతిగా పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడు గోవింద స్వామి నియమితులయ్యేలా ఏకాబిప్రాయానికి రావడం జరిగిందన్నారు.
శివైక్యం పొందిన బ్రహ్మం గారి మఠం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మొదటి భార్యకు నలుగురు సంతానం, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మకు ఇద్దరు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన తదుపరి పీఠాధిపత్యానికి రెండో భార్య కుమారుడు అయ్యేలా వసంత వేంకటేశ్వరస్వామి వీలునామా రాయడం వివాదం రేగడానికి కారణం అయ్యింది. వెంకటాద్రిస్వామిని ఎంపిక చేయడాన్ని మహాలక్ష్మమ్మ మొదటి నుండి వ్యతిరేకిస్తూ వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలు మఠాధిపతులు గత కొద్ది రోజులుగా ఇరువురితో చర్చలు జరిపినా ఏకాభిప్రాయానికి రాలేదు. చివరకు మారుతీ మహాలక్ష్మమ్మ పిల్లలకు న్యాయం జరుగుతుందని, తదుపరి పీఠాధిపతి బాధ్యతలను ఆమె కుమారుడికే అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్రశేఖర ఆజాద్ హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారం అయ్యింది.